Thursday, December 13, 2007

పళని



అందరికి మరొక్కసారి కొత్తబంగారులోకానికి స్వాగతం.ఎన్నో విశేషాలతో కూడిన సుబ్రహ్మణ్యస్వామియొక్క దివ్యక్షేత్రం పళని.ఆ ఆలయాన్ని సందర్శించివద్దాం.తమిళనాడులో వినాయకుని ఉన్నట్లే సుబ్రహ్మణ్యస్వామికి చాలా దేవాలయాలు వున్నాయి.వాటిలో అతి ముఖ్యమైన ఆరు దేవాలయాలని కలిపి "ఆరుపడైవీడు" అని పిలుస్తారు.ఆ ఆరు ఎమిటి ,పళని అనే పేరు ఎలా వచ్చింది,ఇంకా ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకుందాం.సుబ్రహ్మణ్యుని మురుగన్,శరవణన్,కార్తికేయన్,షణ్ముకన్,దేవసేనాపతి ఇంకా చాలా రకాల పేర్లతో పిలుస్తారు.తమిళనాడులో వున్న మురుగన్ యొక్క "ఆరుపడై వీడు" దేవాలయాలు 1.తిరుచెందూర్,2.స్వామిమలై,3.పళని,4.తిరుపరంకుండ్రం,5.తిరుత్తణి,6.పాలముదిర్ సోలై.



వాటిలో అతి ప్రసిద్దమైనది,ముక్యమైనది పళని.పళని ఆండవర్ గా పిలిచే ఇక్కడ స్వామి దండయుధపాణి.చేతిలో దండంతో కొలువై వుంటారు.మెడలో రుద్రాక్ష మాలతో కనిపించే స్వామిది సాధురూపం.ఇది దిండిగల్ జిల్లాలో వుంది.పచ్చని కొండల్నడుమన వున్న ఇక్కడికి వెళ్ళటం చాలా తేలిక.దిండిగల్-కోయంబత్తూర్ రైలుమార్గంలో పళని రైల్వే స్టేషన్లో దిగితే రెండు మైళ్ళ దూరంలో కొండ కనిపిస్తుంది.ఇక మదురైనుంచి కూడా ఇక్కడికి వెళ్ళవచ్చు.కొడైకెనాల్ కూడా ఇక్కడికి దగ్గర.





ఇక పళనికి ఆ పేరు రావటానికి ఒక కారణం వుంది.ఒకసారి కైలాసంలో శివపార్వతులు తమ కుమారులైన వినాయకుడు,సుబ్రహ్మణ్యునితో పాటు వుండగా నారదుడు ఒక జ్ఞానఫలమును ఇచ్చారు.పిల్లలమీద ప్రేమతో పార్వతి ఆ పండును కుమారులకి ఇద్దామని అనుకొన్నా అది ఒకటే పండు.దానిని ముక్కలు చేయకూడదు అని నారదులవారు చెప్పెను.దానితో వారికి ఒక పరిక్ష పెట్టెను.ఎవరు ముందుగా ఈ లోకంలో వున్న అన్ని పుణ్యతీర్ధాలలో తిరిగి ముందు వస్తారో వారికి ఈ ఫలము ఇస్తానని చెప్పెను.దానితో సుబ్రహ్మణ్యుడు నెమలిపై వెళ్ళిపోయెను.కాని వినాయకుడు తల్లితండ్రుల చుట్టూ మూడుసార్లు తిరిగి ఆ ఫలమును సంపాధించెను.తరవాత వచ్చిన మురుగన్ ఆ విషయము తెలిసి అలిగి ఈ ప్రాంతానికి వచ్చి వుండిపోయారు.దానితో శివపార్వతులు ఇక్కడికి వచ్చి సుబ్రహ్మణ్యుని బతిమాలుతు "ఫలం నీ"(నీవే ఫలము)అని బతిమాలిరి.అలా కాలక్రమంలో ఈ ప్రాంతానికి పళని అని పేరు వచ్చింది అనేది పురాణగాధ.



7వ శతబ్దంలో కేరళ రాజు ఈ ఆలయాన్ని నిర్మించాడు.తర్వాత నాయకరాజులు,పాంద్య రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ది చేసారు.సముద్ర్మట్టానికి 1500 అడుగుల ఎత్తులో ఈ గుడి వుంది.కొండపైకి వెళ్ళటాని మెట్లు వున్నాయి.మెట్లు ఎక్కలేనివారి కోసం రోప్ వే మార్గం వుంది.
కొండపైకి వెళ్ళటానికి మొత్తం 697 మెట్లు వున్నాయి.

విశేషాలు:

1.దేశంలో తిరుపతి తర్వాత,తమిళనాడు మొత్తానికి ఎక్కువ ఆదాయంవచ్చే క్షేత్రం పళని.
2.ఆలయగోపురం బంగారంతో పూతపూయబడి వుంటుంది.



3.ప్రతియేటా జరిగే "పంకుని ఉత్తిరం","తాయిపూమాసం" ఉత్సవం చూసితీరాల్సిందే.ఆ సమయంలో ఎక్కడెక్కడినుంచో భక్తులు పాదయాత్రలు చేస్తూ స్వామిని దర్శించటానికి వస్తారు.పసుపు బట్టలుకట్టుకుని కాలినడకన వందల కి.మీటర్ల దూరం నడిచి ఇక్కడికి వచ్చి మొక్కు తీర్చుకుంటారు.తాయిపూసం అప్పుడు పదివేల కావడులు,పంకుని ఉత్తిరం అప్పుడు రమారమి 50,000 కావడులు పాలు,రోజ్ మిల్క్ వస్తుందని ఒక అంచనా.


చిన్నపిల్లలకి మురుగన్ లాగ వేషం వేయించి నెమలి ఈకలతో అలంకరించబడిన కావడి మోసుకొని వస్తారు.అలాగే మొక్కుకున్నవారు తమ శరీరానికి శూలలుగుచ్చుకొని వస్తారు.




4. ఇక పళని ప్రసాదం తిరుపతి లడ్డు ఎంత ఫేమసో పళని "పంచామృతం" అంత ప్రసిద్ది.స్వామికి పంచామృతంతో రోజూ అభిషేకం చేస్తారు.అతి రుచికరంగా వుండే ఈ పంచామృతం.పేరు చెపితే నోరూరేటంత రుచిగా వుంటుంది. కర్జూరం,అరటిపండు,తేనే,నెయ్యి,కలకండ,కిస్మిస్,జీడిపప్పు మొదలైనవి కలిపి చేసే ఈ పంచామృతం చాలా రోజులు అంటే నెలలు కూడ నిలువ వుంటుంది.పావుకిలో ధర 25రూ.

5.ఇక్కడ స్వామి కౌపీనం(గోచి) మాత్రమే ధరించి వుంటారు(నిజరూపంలో).



ఇక్కడికి రెండు సార్లు వెళ్ళాను.కొడైకెనాల్ వెళ్ళినప్పుడు ఒకసారి.విడిగా ఒకసారి వెళ్ళాను .అదండి పళని విశేషాలు.మళ్ళి కలుస్తాను మరో ప్రాంత విశేషాలతో.అంతవరకు శెలవు.