Sunday, July 25, 2010

ముచ్చటగా మూడో పుట్టినరోజు

నా బ్లాగు ముచ్చటగా మూడో పుట్టినరోజు జరుపుకుంటుంది. ఆదరిస్తున్న అందరికీ ధన్యవాదాలు.

Thursday, July 15, 2010

చైతన్యానికి చిరునామా బాలచందర్


ఇతర భాషా చిత్రాల్లో లబ్ద ప్రతిష్టులైన దర్శకులు ఎందరో, తెలుగు చిత్ర పరిశ్రమలోనూ సత్తా చూపారు. అటువంటివారిలో ప్రధముడు కైలాసం బాలచందర్. తమిళ చిత్ర దర్శకుడుగా ఎంత పేరు గడించారో, తెలుగులో కూడా అంత ఘనత సాధించారని చెప్పవచ్చు. కళాతపస్వి విశ్వనాధవారిలా, బాలచందర్ ’స్త్రీ’ పాత్రల ప్రత్యేకతే వేరు. సమాజంలో, కుటుంబంలో అనేక పాత్రలను పోషిస్తూ, సతమతమయ్యే స్త్రీలయొక్క సున్నిత భావోద్వేగాలను, మానసిక సంఘర్షణలను మనం గమనిస్తూ ఉంటాము.

అంతులేని కథ:

మధ్య తరగతి యువతి సరిత (జయప్రద) తన కుటుంబం కోసం, గర్విష్టి, రాక్షసి అనే బిరుదులు ఇంటా బయటా పొందుతుంటుంది. పైకి కఠినంగా ప్రవర్తిస్తూ తన సంపాదనంతా కుటుంబం కోసమే ఖర్చుచేస్తూ చెల్లెలు కోసం తన ప్రేమనుకూడా వదులుకొని పెళ్లికాని ఉద్యోగినిగానే జీవితం గడిపే అమ్మాయి. మన సమాజంలో ఇలాంటివారు కన్పిస్తూనే ఉంటారు. వారందరి ప్రతినిధిగా ఈ పాత్రను మలిచిన తీరు అభినందనీయం. ఇందుకు పూర్తి వ్యతిరేకంగా ‘్ఫటాఫట్’ అంటూ జీవితాన్ని తేలికగా తీసుకొని ఎదురు దెబ్బతిన్న ‘జయలక్ష్మీ’ ఈమె తల్లి ‘జయ విజయ’ ‘తల్లీ కూతుళ్ల మధ్య ఏ పోరయినా ఉండచ్చు కానీ సవితి పోరు ఉండకూడదు’ అంటూ ఆత్మహత్య చేసుకుంటుంది. కారణం కూతురు ప్రియుడుచే వంచింపబడడం, విచ్చలవిడి తనం తెచ్చే ముప్పును సున్నితంగా చూపారు పై పాత్రలచే.

ఆకలి రాజ్యం:

ఈ చిత్రంలో హీరోయిన్ దేవి (శ్రీదేవి). తాగుబోతు తండ్రిని, బామ్మను కష్టపడి నాటకాల్లో వేషాలు వేసి పోషిస్తుంటుంది. డబ్బున్న నాటకాల యజమాని పెళ్లడతానని వెంటాడినా, తిరస్కరిస్తుంది. ‘ఆకలి అంటే నాకు గౌరవం’ అంటూ, ఆత్మగౌరవం, చంపుకోలేని వ్యక్తిత్వంగల రంగా పేదవాడయినా, అతన్ని ప్రేమించి, అతనితో జీవితం పంచుకోటానికి సిద్ధపడుతుంది. డబ్బు కంటె, ప్రేమకు విలువనిచ్చిన వ్యక్తిత్వం ఈమెది.

మరోచరిత్ర:

ప్రేమకధా చరిత్రలో కొత్తమలుపులు సృష్టించారు బాలచందర్ ఈ చిత్రంలో. హీరోయిన్ స్వప్న (సరిత) పెద్దల మాటకు విలువనిచ్చి యేడాది ప్రియునికి దూరంగా గడపటానికి, మనసు కట్టడి చేసికొని ‘తుది గెలుపు ప్రేమకే నని రుజువు చేయాలని తపిస్తుంది. తను పతనం కావటమే కాక ఎదుటివాళ్లనూ తన దారిలోకి మళ్లించాలని చూసే ‘పాప’. భర్తపోవటంతో తనను తాను నియంత్రించుకుని ప్రశాంతగా జీవిస్తున్న ‘మాధవి’. ఆవేశం, తొందరపాటుగల హీరో, ఆమెను చేపట్టబోయినా, అతన్ని సరిదిద్ది ప్రేమికుల్ని కలపాలని కృషిచేసిన ధీర. ఎప్పుడోకాని మాధవి, స్వప్నలు మన కెదురుగారు ఈ సంఘంలో.

గుప్పెడు మనసు:

ఇందులో మూడు పాత్రలు, విద్య (సుజాత), సెన్సార్ ఆఫీసర్, రచయిత్రి. సరిత (బేబీ). సరిత తల్లి శ్రీమతి (కాకినాడ శ్యామల). శ్రీమతి ఒకప్పటి మాజీ నటీమణి, అనుకోకుండా ఆమెకు ఒక చిత్రంలో నటించే అవకాశం రావటం, దానికోసం ఆమె పడే ఎగ్జయిట్‌మెంట్, ఉదయం లేవాలని అలారం పెట్టుకుని శాశ్వత నిద్రలోకి జారుతుంది. ‘స్త్రీ’ భావోద్వేగాల స్థాయి తెలిపే సన్నివేశం అత్యంత సహజంగా చిత్రీకరించారు దర్శకులు బేబీ (సరిత) అంకుల్ శరత్‌బాబు ఇంటిలో ఓ బలహీన క్షణంలో తప్పుచేసి ఆ ఇంటినుంచి వెళ్లిపోయి బిడ్డను కని స్వతంత్రంగా జీవిస్తూ ఆత్మహత్య చేసుకుని జీవితాన్ని ముగిస్తుంది. విద్య సెన్సార్ ఆఫీసరుగా ఏ పాయింట్‌ను ఒప్పుకోనని ఇంటికి వస్తుందో, ఇంటివద్ద అదే సంఘటన ఎదురు కావటంతో తన అభ్యంతరాన్ని ఉపసంహరించుకున్నట్టు ఫోనుచేస్తుంది. ఆదర్శవంతమైన రచయిత్రి, సామాన్య గృహిణి ఈ రెండు స్వభావాల వైవిధ్యాలను తన నటనతో సుజాత, చిత్రీకరణలో దర్శకులు అద్భుతంగా ఆవిష్కరించారు.

ఇది కథకాదు:

మానసిక, శారీరక హింసలు పెట్టే శాడిస్టు భర్త (చిరంజీవి) నుంచి విడాకులు పొంది బిడ్డతో బయటకు వస్తుంది సుహాసిని (జయసుధ). అక్కడ ఆమెకు తన మాజీ ప్రియుడు భరణి (శరత్‌బాబు)ని కలుసుకుంటుంది. అతన్ని భర్తగా పొందాలని ఆశ, ఆకాంక్ష, కట్టుబాట్లను ఎదిరించాలని కోరిక ఉన్నా, భర్త కట్టిన తాళిని గుండెలపై నుంచి తీయలేక క్రొత్త జీవితాన్ని స్వాగతించలేని పిరికితనం. ఈ పాత్రలోని వైవిధ్యం, చిత్రీకరణలోను, జయసుధ నటనతోను పరాకాష్ట చేరుకుంది. ఆఫీసులో ఆమెను మూగగా ఆరాధిస్తున్న ‘జానీ’. మనసు తెలిసినా, భర్తకు, ప్రియునికే ఆమె ప్రాధాన్యాన్నిస్తుంది. ఒక్క చుక్క కన్నీరు ఆమె కంటినుంచి తెప్పించాలని చివరి వరకూ ప్రయత్నించిన ఆమె భర్త, ఆమె కెంతో ఇష్టమయిన మోనాలిసా చిత్రాన్ని కత్తితో గాయపరిచినా చలించని ధీర యువతి. కొడుకు చేసిన తప్పకు కోడలికి, మనవడికి అండగా నిలవటానికి కోడలి గుండెలపై తాళితీసి దేవుని హుండీలో వేసి, క్రొత్తగా జీవితం మొదలు పెట్టమని ఆశీర్వదించే సుహాసిని అత్తగారి పాత్ర, వయస్సు మళ్లినా ప్రగతిశీల భావంతో రూపొందింది.

సింధుభైరవి:

శాస్ర్తియ సంగీతంలో అద్బుత గాయకుణ్ణి పల్లె పదాలవైపూ నడిపించి, అతని ఆరాధనలో ఆకర్షణలో తన సరస్వం అర్పించిన భైరవి (సుహాసిని). తన ఉనికి అతని భార్య కిష్టం లేదని మొదట దూరమయి, తన విరహంతో అతడు సంగీతానికి దూరమయి, పతనం కావటం భరించలేక, అతని ఉన్నతికి పాటుపడుతుంది. అతనివల్ల పొందిన బిడ్డను ఆ కుటుంబానికి కానుకగా ఇచ్చి అతని జీవితంనుంచి నిష్క్రమిస్తుంది. వయస్సులో తనుచేసిన తప్పుకు ప్రతి రూపంగా ఎదుట నిలిచిన కూతురును ఆదరించలేక తిరస్కరించలేక సతమతమమయ్యే తల్లిగా మణిమాల. సమాజంలో ఇటువంటి వారి జీవితాల, స్వభావాల అంతర్ మధనం తెలియవస్తుంది.

47 రోజులు:

చిత్రంలో ఏమీ చదువులేని యువతిగా, మోసగాడైన భర్తనుంచి, పారిస్‌నుంచి తప్పించుకుని, ఇండియా వచ్చి వంటరిగా జీవితం సాగించిన ధైర్యవంతురాలు ‘జయప్రద’.మన్మధలీల చిత్ర నాయికి ‘హలం’ భర్త అలవాట్లను భరించలేక ఎలా నలిగిపోయింది. చివరకు ఏం నిర్ణయించుకున్నది సరదాగా, హాస్యంగా కొంత చూపారు. చివరలో జయప్రద తన భర్త చేత ‘దట్ ఫెలో’ అనిపించటం ఓ విశేషం.

బాలచందర్ తొలి చిత్రం ‘భలే కోడళ్ళు’లో ఉమ్మడి కుటుంబంలో ముగ్గురు కోడళ్ళు, పక్కింటి సినిమా తార ప్రభావంతో పడిన కల్లోలం, తరువాత ఎలా చక్కదిద్దుకున్నారో తమ ‘కాపురాలను’ హాస్యంతో రంగరించి చూపారు.

‘బొమ్మ బొరుసు’లోని అహంకారి అత్త, స్వాభిమానంగల కూతురు పాత్రలు ఓ విలక్షణ సృష్టి.
కడుపుకోసం ఒళ్లమ్ముకుని కొడుకు చేతిలో హత్య కావించబడిన యువతి ‘జయమాలిని’, ఉంచుకున్నవాడి గౌరవం కాపాడడానికి హత్యానేరం మీద వేసుకుని జైలుకెళ్లిన ‘దబ్బపండు’ (వై.విజయ). కుండలమ్ముకుంటున్నా అల్లరిగా, మహారాణి కలలు కనే పాపమ్మ (సరిత) రౌడీగా ఉన్నవాడికి, చదువు సంస్కారం నేర్పి రాష్టమంత్రిగా, ఉన్నతునిగా మార్చిన రాణి (జయసుధ) వీరందరూ బాలచందర్ చెప్పినట్లు ‘ఆడాళ్ళు మీకు జోహార్లు’’.
తనను నిచ్చెనలా వాడుకుని ఉన్నతంగా ఎదిగిన వాడిని క్షమించి, సాయపడే చెవిటి కథానాయిక ‘కోకిలమ్మ’ (సరిత)
బాలచందర్ మహిళా పాత్రలన్నీ తమ వ్యక్తిత్వాన్ని, అస్థిత్వాన్ని నిలబెట్టుకుంటూ ఉన్నతిని సాధించినవే. విశ్వనాధ వారు నృత్య, సంగీతాలకు తమ ‘స్త్రీ’ పాత్రలద్వారా పెద్ద పీట వేస్తే, బాలచందర్ పాత్రలు సామాజిక దృష్ట్యా ప్రాచుర్యం పొందాయి. మరుపురాని విధంగా మనసులపై బలమైన ముద్రవేశాయి.

Tuesday, July 6, 2010

50 వసంతాల జగపతి పిక్చర్స్

'జగపతి’ సంస్థకు ఇది స్వర్ణోత్సవ సంవత్సరం (1960-2010).‘జగపతి’ పేరు వినగానే బలమైన కథ, ప్రేక్షకుల్ని కదిలించే సన్నివేశాలు అద్భుతమైన నటన, వీటన్నిటినీ మించి ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించే సంగీతం గుర్తుకువస్తాయి. అందుకే చిత్ర జగతిలో జగపతి సంస్థకు ప్రత్యేక స్థానం. దీని అధినేత వీరమాచినేని రాజేంద్రప్రసాద్. కాకినాడ కాలేజీ రోజుల్లోనే నాటకాల్లో స్త్రీ పాత్రలు పోషించి, హీరో అక్కినేనిని అభిమానించి, మద్రాసు చేరి హీరో వేషాలకోసం ప్రయత్నించి అది ఫలించక మిత్రులు రంగారావుతో కలిసి జగపతి సంస్థను ప్రారంభించి, వి.మధుసూదనరావు దర్శకత్వంలో ‘కుటుంబ కథా చిత్రం ‘అన్నపూర్ణ’ నిర్మించి 3-06-1960న విడుదల చేసారు. అంటే యాభై ఏళ్ల కిందట. ఇక వారి చిత్ర విశేషాలు చూద్దాం.



అన్నపూర్ణ: 1959లో ఈ చిత్రానికి స్వీకారం చుట్టారు. వి.మధుసూదననరావు దర్శకులు. సదాశివబ్రహ్మం కథ, ఆరుద్ర పాటలు, సుసర్ల దక్షిణామూర్తి సంగీతం, కమల్‌ఘోష్ కెమెరా. కొద్దిపాటి సస్పెన్స్‌తో కూడిన కుటుంబ కథా చిత్రం ‘అన్నపూర్ణ’లో టైటిల్ రోల్‌ను జమున పోషించగా హీరోపాత్రను జగ్గయ్య, ఇతర సహాయ పాత్రలను గుమ్మడి, ముక్కామల, సిఎస్‌ఆర్ నిర్వహించగా హాస్య జంటగా రేలంగి, గిరిజ రాణించారు. కథానాయికపై చిత్రీకరించిన ‘తళ తళా మిలమిల’ అనే గీతం, హాస్య జంటపై చిత్రీకరించిన ‘వగలాడి వయ్యారం భలే జోరు’ యుగళ గీతం ‘మనసేమిటో తెలిసిందిలే’ బాగా ప్రాచుర్యం పొందాయి. అన్నపూర్ణ చిత్రం 3-06-1950న విడుదలై ఆర్ధికంగా విజయాన్ని సాధించి, నిర్మాత రాజేంద్రప్రసాద్‌కు ధైర్యాన్నిచ్చింది.

ఆరాధన: జగపతి సంస్థ జైత్రయాత్ర ‘ఆరాధన’తో మొదలైందని చెప్పుకోవాలి. కారణం నిర్మాత రాజేంద్రప్రసాద్ అభిమాన హీరో అక్కినేని నాగేశ్వరరావు ఈ చిత్రంలో హీరోగా నటించడమే కాక, జగపతి సంస్థ స్థాపించిన చిత్రాల్లో, పదమూడు చిత్రాలకు హీరోగా నటించారు. అలాగే ఆ సంస్థ ఆస్థాన కళాకారులుగా, గుమ్మడి, జగ్గయ్య ఎక్కువ సంఖ్యలో విలక్షణ పాత్రలు పోషించారు. ఆరాధన చిత్రానికి మూలం ఉత్తమకుమార్, సుచిత్రసేన్ నటించిన ‘సాగరిక’ బెంగాలీ చిత్రం. ఆత్రేయ, నార్ల చిరంజీవి, శ్రీశ్రీ రాసిన పాటలకు, సాలూరి రాజేశ్వరరావు సంగీతాన్ని అందించారు. క్లిష్టమైన మానసిక సంఘర్షణకు లోనైన ‘అనురాధ’ పాత్రకు ప్రాణంపోసారు సావిత్రి. రమణారెడ్డి, రేలంగి, గిరిజ హాస్యాభిషేకం చేసారు. హీరోపై చిత్రీకరించిన ఘంటసాల పాట, ‘నా హృదయంలో నిదురించే చెలి’ నాయికపై చిత్రీకరించిన ‘నీ చెలిమి నేడే కోరితిని’, ‘వెన్నెలలో వికాసమే’ గీతాలు నేటికీ సంగీత ప్రియులను అలరిస్తూనే వుంటాయి.

ఆత్మబలం: ఆరాధన తర్వాత భాగస్తుడు రంగారావు మరణించడంతో రాజేంద్రప్రసాద్ సోలో నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘ఆత్మబలం’. దీనికి ‘అతుల్ జహీర్ ఆహ్వాన్’ అనే బెంగాలీ చిత్రం మూలం. ఈ చిత్రంతోనే జగపతి సంస్థలో, గీతరచయితగా ఆత్రేయ, సంగీత దర్శకునిగా కె.వి.మహదేవన్ హవా ప్రారంభమయి ఓ దశాబ్దం పాటు ఆంధ్ర దేశాన్ని కుదిపేసాయి.
జగ్గయ్యది విచిత్రమైన సైకిక్ క్యారెక్టర్. అతన్ని కంట్రోల్ చేసేది హీరో ఆనంద్. ఇద్దరి మధ్యా నలిగిపోయే కథానాయిక బి.సరోజాదేవి. చిత్రంలోని హిట్ సాంగ్స్ ‘చిటపట చినుకులు పడుతు వుంటే’, గిల్లి కజ్జాలు తెచ్చుకునే అమ్మాయి, పరుగులు తీసే నీ వయసునకు) అద్భుతంగా, నేత్రపర్వంగా చిత్రీకరించారు కెమెరామెన్ సి.నాగేశ్వరరావు. హీరో నాగేశ్వరరావు నిబంధనల మేరకు ఈ చిత్రాన్ని ఎక్కువ భాగం హైదరాబాద్‌లో చిత్రీకరించారు. పద్ధతి ప్రకారం రమణారెడ్డి, రేలంగి, గిరిజ హాస్యాన్ని అందించారు.

అంతస్తులు: ప్రముఖ తమిళ రచయిత జావర్ సీతారామన్ అందించిన కథతో రూపొందిన చిత్రం అంతస్తులు. గుమ్మడి జమిందారు, క్రమశిక్షణకు మారుపేరు. భార్య జి.వరలక్ష్మి, పెద్దకొడుకు నాగేశ్వరరావు, చిన్నకొడుకు నాగరాజు. తండ్రి క్రమశిక్షణ తట్టుకోలేని చిన్న కొడుకు మరణిస్తాడు. అది చూసి జమిందారి బంధనాలనుంచి బయటపడ్డ కథనాయకుడు విలన్ జగ్గయ్య వలలో పడతాడు. తన తండ్రి చేసిన పొరపాటువల్ల అనాధగా బతుకుతున్న భానుమతికి ఆశ్రయం కల్పిస్తాడు. ప్రేమించిన సామాన్యురాలు మాలను వివాహం చేసుకుని మమతలకు, అనురాగాలకు అంతస్తులు అడ్డుకావని నిరూపిస్తాడు. ఆరోజు కుర్రకారును అంటే కాలేజీ స్టూడెంట్స్‌ను, యువతను ఉర్రూత లూపిన యుగళ గీతం ‘తెల్ల చీర కట్టుకున్నదెవరికోసం’, భానుమతిపై చిత్రీకరించిన ‘వినరా విస్సన్న’, ‘దులపర బుల్లోడా’ పాటలు, లాల్ అండ్ హార్డ్లీ తరహాలో రేలంగి, రమణారెడ్డి అందించిన హాస్యం ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఈ చిత్రానికి కేంద్ర ప్రభుత్వ రజిత పతకంతోపాటు రాష్ట్రప్రభుత్వ బంగారు నంది పురస్కారం లభించింది.

ఆస్తిపరులు: సిస్టర్ సెంటిమెంట్‌తో సాగిన ఈ చిత్రంలో జయలలిత అభినయం ఓ ప్రత్యేక ఆకర్షణ. అక్కినేని హీరో, విలన్ జగ్గయ్య ఇద్దరూ అన్నదమ్ములే. అయితే ఆస్తికోసం అన్నను అడ్డు తొలగించుకునే ప్రయత్నంలో చేసిన కత్తియుద్ధం, క్లయిమాక్స్‌లో అగ్ని జ్వాలల మధ్య దిగుడు బావిలో హీరో చేసిన సాహస విన్యాసం చాలా డైనమిక్‌గా చిత్రీకరించారు దర్శకులు వి.మధుసూదనరావు.

అదృష్టవంతులు: ఈ చిత్రంలో కూడా జయలలిత గ్లామర్‌తోపాటు నటనకు నాట్యానికి అకాశం వున్న కథానాయిక జయ పాత్రను పోషించారు. అయ్యయ్యో బ్రహ్మయ్య పాటతో కొత్త తరహా స్టెప్స్‌కు నాంది పలికారు అక్కినేని. పతాక సన్నివేశం పరుగెత్తే రైలు టాప్‌మీద హీరో చేసిన ఫైట్ ఉత్కంఠ కలిగిస్తాయి. ఈచిత్రంలోని పాటలన్నీ హిట్టయి చిత్ర విజయానికి దోహదం చేసాయి. జగపతి సంస్థ నిర్మించిన తొలిచిత్రం అన్నపూర్ణ దర్శకుడు వి.మధుసూదనరావు, ఆ సంస్థకు అక్కినేనితో పనిచేసిన చివరి చిత్రం ‘అదృష్టవంతులు’.

అక్కాచెల్లెలు: ఎల్.వి.ప్రసాద్‌గారి సోదరుడు, ప్రముఖ ఎడిటర్ ఎ.సంజీవి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో షావుకారు జానకి అక్కినేనితో జంటగా నటించి ‘పాండవులు పాండవులు తుమ్మెదా’ పాటతో అదరగొట్టారు. సస్పెన్స్‌తో సాగిన ఈ చిత్రంలో కృష్ణ,విజయనిర్మల రెండవ జంటగా నటించారు.

దసరా బుల్లోడు: నిర్మాత రాజేంద్రప్రసాద్ తాను పుట్టి పెరిగిన పల్లెటూరి వాతావరణం నేపథ్యంగా చేసుకుని ఈ కథను రూపొందించారు. వి.మధుసూదనరావు బిజీగా ఉండడంవల్ల హీరో నాగేశ్వరరావును దర్శకత్వం వహించమని కోరారు నిర్మాత. ఐతే అక్కినేని సున్నితంగా తిరస్కరించి, రాజేంద్రప్రసాద్‌నే దర్శకత్వం వహించమని ప్రోత్సహించారు. వాణిశ్రీ, చంద్రకళ, ఎస్.వి.రంగారావు, గుమ్మడి, నాగభూషణం, సూర్యకాంతం, అంజలీదేవి, పద్మనాభం వంటి హేమాహేమీలు నటించారు. ఈ ముక్కోణ ప్రేమ కథా చిత్రానికి ఆత్రేయ, కె.వి.మహదేవన్, నృత్యదర్శకుడు హీరాలాల్, కెమెరామెన్ ఎస్.వెంకరత్నం కాంబినేషన్‌లో రూపొందిన పాటలన్నీ ప్రేక్షకులకు కనువిందు చేసాయి. దర్శకునిగా రాజేంద్రప్రసాద్ ప్రతిభకు జేజేలు పలికింది ఆంధ్రప్రేక్షక లోకం.

బంగారుబాబు: అక్కినేని, వాణిశ్రీ కాంబినేషన్‌లో రాజేంద్రప్రసాద్ రూపొందించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్, సినీతార జీవితం నేపథ్యంగా సాగిన ఈ చిత్ర షూటింగ్ సన్నివేశంలో ప్రముఖ నటులు కృష్ణ, సత్యనారాయణ, శివాజీ గణేశన్, రాజేష్‌ఖన్నా అతిథులుగా నటించారు. క్లైమాక్స్‌లో తీసిన హెలికాప్టర్ ఫైట్ ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

శోభన్‌బాబు కథానాయకుడుగా రాజేంద్రప్రసాద్ రూపొందించిన చిత్రాలు ‘మంచిమనుషులు’, ‘పిచ్చి మారాజు’, ‘అందరూ దొంగలే’. అన్నపూర్ణ సంస్థతో కలిసి జగపతి సంస్థ అందించిన చిత్రం ‘రామకృష్ణులు’ ఇందులో ఎన్‌టిఆర్, జయసుధ, అక్కినేని, జయప్రద, సత్యనారాయణ ప్రధాన పాత్రధారులు. నిర్మాత రాజేంద్రప్రసాద్ వారి అబ్బాయి జగపతి బాబును, హీరోగా పరిచయం చేస్తూ వి.మధుసూదనరావు దర్శకత్వంలో తీసిన చిత్రం సింహస్వప్నం అనుకున్న విజయాన్ని సాధించలేదు. ఇంకా లంచావతారం, కిల్లర్, పెళ్లిపీటలు, బంగారు బుల్లోడు వంటి చిత్రాలను అందించారు. తెలుగులో 26, తమిళంలో 3, హిందీలో 3 చిత్రాలను జగపతి సంస్థ నిర్మించింది. వీటిలో రాజేంద్రప్రసాద్ దర్శకత్వం వహించిన చిత్రాలు 18. వాటిల్లో అధిక శాతం విజయాన్ని చవి చూసినవే. ఐతే మారుతున్న విలువలు, వేగం దృష్ట్యా నిర్మాణ రంగానికి దూరంగా వుంటున్నది జగపతి సంస్థ. ఫిలింనగర్‌లో దేవాలయాల సముదాయానికి రూపకల్పనచేసి చరితార్థుడైనారు రాజేంద్రప్రసాద్. చిత్రరంగానికి నిర్మాతగా, దర్శకునిగా వి.బి.రాజేంద్రప్రసాద్ అందించిన సేవలను గుర్తించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2003వ సంవత్సరానికి రఘుపతి వెంకయ్య ప్రతిష్టాత్మక పురస్కారంతో సత్కరించింది.