Sunday, October 28, 2007

కొడైకెనాల్ విహారం(ముగింపు)



కొడైకి వెళటానికి చెన్నై వెళ్ళి అక్కడనుంచి దిండిగల్ కాని మదురైగాని చేరుకుంటే అక్కడినుంచి సులువుగా చేరుకోవచ్చు.కొడైకెనాల్కి అతి దగ్గర రైల్ స్టేషన్ కొడైరోడ్.ఇది కొండ దిగువున వుంటుంది.ఇక్కడనుంచి 60 కి.మీ దూరం ఘాట్ రోడ్లొ ప్రయాణిస్తే కొడైకెనాల్ చేరుకోవచ్చు. అతి దగ్గరలోని విమానాశ్రయం మదురైలో వుంది.ఇక్కడనుంచి కొడై సుమారు 100 కి.మీ వుంటుంది.




కొడైలో ప్రధానమైన టూరిస్ట్ సీజన్ మే,జూన్.కనుక ఈ నెలల్లో వెళ్ళేవాళ్ళు ముందుగా రూము బుక్ చేసుకోవటం మంచిది.అన్ని తరగతులవారికి తగినవిధమైన కాటేజ్లు,హోటెళ్ళు ఇక్కడ వున్నయి.గ్రీన్ లాండ్స్ యూత్ హాస్టల్ ఎంతో అందమైన ప్రాంతంలో,ప్రసాంతమైన ప్రదేశంలో వుంటుంది.మిగతా వాటితో పొలిస్తే కొంత ఖరీదు తక్కువ కూడా.దీనికన్న తక్కువ ధరలో కూడా గదులు లభించే రిసార్ట్లు వున్నాయి.కొడైలో గోల్ప్ కోర్ట్ కూడా వుందండి.

కేరళలోని మున్నార్ కి కొడైకెనాల్ కి కొంత సామీప్యం వుంది.అదే 12 సంవత్సరాలకొక సారి పూసే నీలకురింజి పూలు.నీలి రంగులో చిన్నగా వుండే ఈ నీలికురింజి పువ్వు పుష్కరానికి ఒక్కసారి మాత్రమే పూస్తుంది.అప్పుడు కొండలన్ని నీలి వర్ణం పులుముకుని మైమరపిస్తాయి.




ఇవి కొడైలో కంటే మున్నార్ లొ ఎక్కువగా పూస్తాయి.అప్పుడు కొడైగాని,మున్నార్ కాని నీలి అందాలతో మనసును కట్టిపడేస్తాయి.నాకు తెలిసి రెండు ,మూడు సంవత్సరాల క్రితం ఈ పూలు పూసాయి.మళ్ళి ఆ పూలు చూడాలంటే కొన్నాళ్ళు ఆగాలి.




కొడైలో లభించే హోం మేడ్ చాక్లెట్లు తప్పక రుచిచూడవలసిందే.ఇవి కొడై ఎక్కడైనా మీకు దొరుకుతాయి.ప్రతి వీధిలో ఈ షాపులు వుండాలిసిందే.కొడైలో కోతులు కూడా ఎక్కువే.




దానికి తగ్గట్టు ఈ ఫొజులు చూడండి.కోతి చేష్టలు అంటే ఇవేనేమో.



అన్నట్లు చెప్పటం మరిచాను కొడైలో ఐస్ క్రీం షాపులు కూడా వున్నాయండి.నేను తినలేదు మీరు వెళితే ట్రై చెయ్యండి.ఈ కోతి చూసారా ఐస్ క్రీం లాగించేస్తుంది.




అదండి కొడై గురించిన విశేషాలు.అందరికి నచ్చాయని ఆశిస్తూ మళ్ళి ఇంకో విహారయాత్రా విశేషాలతో మళ్ళి కలుస్తాను.అంతవరకు సెలవు.

Thursday, October 25, 2007

కొడై అందాలు మరికొన్ని




కొడైలో సొంత వాహనం వుంటే అన్నిచోట్లకి తిరగవచ్చు.లేదా టాక్సిలోనో,సైకిల్లు అద్దెకి తీసుకుని తిరగవచ్చు.మరీ ఎక్కువ సమయం వుంటే కాలినడకన వెళ్ళినా కొడై అందాలు ఎంతో ఆహ్లాదం కలిగిస్తాయి.పక్షులని పరిశీలించేవారికి ఈ ప్రాంతంలో అనేక జాతుల పక్షులు కనిపిస్తాయి.




కొడైలో అందరు మొదట వెళ్ళేది కోకర్స్ వాక్ ఇది కొడైకి వాయువ్య దిశగా సాగే నిట్టనిలువు రోడ్.పొద్దునే ఇక్కడికి చాలా మంది వాకింగ్ కి వస్తారు.




ఇక్కడ ఒక అబ్జర్వేటరి వుంది.బైనాక్లురర్లో కొడై అందాలు వీక్షించవచ్చు.దీనికి ఎదురుగా బ్రయంట్ పార్క్ వుంది.కొడైకి 7 కి.మీ దూరంలో సిల్వర్ కేస్కేడ్ జలపాతం వుంది.ఇది కాక ఇంకా బంబర్,గ్లెన్,ఫెయిరీ ఫాల్స్,బేర్ షొలాఫాల్స్ మొదలైన జలపాతాలు వున్నాయి.



తమిళులు మురుగన్ గా పిలిచే సుబ్రమణ్యస్వామి కోవెల కురుంజి ఆండవర్ కోవెల చూడదగ్గది.




అక్కడినుండి పళని కొడలు,వైగై డ్యాముల అద్బుత దృశ్యాలు కనిపిస్తాయి.కనువిందు చేసే మరో ప్రాంతం పెరుమాళ్ పీక్.కొడైకి 12 కి.మీ దూరంలో వున్న ఇదే కొడై కొండల్లో అతి ఎత్తైన శిఖరం.శెంబగనూర్ మ్యూజియం కూడా చూడదగ్గది.




వర్షంలో తడిసిన కొడై మరింత అందంగా వుంటుంది.కాని వర్షం వస్తే ఎక్కడికి వెళ్ళలేం.

అదండి.ఇక కొడై కి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాలు(ఫైనల్ టచ్)ఆఖరి టపాలో తెలియచేస్తాను.అంతవరకు సెలవు.

Sunday, October 21, 2007

విజయదశమి(దసరా)శుభాకాంక్షలు

అందరికి విజయదశమి శుభాకాంక్షలు.



దుర్గామాత యంత్రం:




బొమ్మలకొలువు:

Wednesday, October 17, 2007

మంచు కురిసే వేళలో కొడై అందాలు

కొడై కెనాల్ అందాలు మంచు కురిసేటప్పుడు మరింత అందంగా వుంటాయి మంచులో తడిసిన ముద్దమందారంలా.మంచులో తడిసిన కొడైని చూసే భాగ్యం కలగటం అదృష్టం.



కొడైలో చూడదగ్గ ప్రదేశాలలో పిల్లర్ రాక్స్ ఒకటి. ఇది లేక్ నుంచి సుమారు 8 కి.మీ.వుంటుంది.మబ్బులు మన పైనే తేలియాడుతున్నట్లు వుంటుంది ఇక్కడ.ఇవి 400 అడుగుల ఎత్తున స్తంభాలులా వుండే మూడు రాళ్ళు.ఇక్కడ డ్రై ఫ్లవర్స్ అమ్ముతారు.




కులుకులొలుకు చెలి చెంతనుండగా ఊటి,కొడైకెనల్ ఏలనో అని పాట వుందిగాని కొడై వచ్చెది ఎక్కువమంది కొత్త జంటలే.




పగలు అప్పుడప్పుడు ఎండ వెచ్చదనాన్ని ఇచ్చినా చలి విపరీతం.కనుక కొడై వెళ్ళేవాళ్ళు తప్పక స్వెటర్లు తీసుకువెళ్ళలి.తీసుకువెళ్ళకపోయినా లేక్ దగ్గర చాలా షాపులు వుంటాయి.బేరమాడి కొనుక్కొవచ్చు.



దట్టంగా మచుకురుస్తుంటే చలి తట్టుకోలేము గాని మంచి మంచి అందాలు కొన్ని అప్పుడే బంధించగలం.మేము బస చేసిన కాటేజిలో వాడు రగ్గులు ఇచ్చినా అవి కూడా చల్లగా అయిపోయి ఆ చలి తట్టుకోలేక చచ్చా.




పొద్దున్నే లేచి మొహం కడుకుందామని బాత్రూంకి వెళ్ళితే ఆ గీజరు ఎలా ఆను చెయ్యాలో తెలియలేదు.ఎవరినైనా లేపుదామా అంటే అందరు మంచి నిద్రలో వున్నారు.సర్లే అని ఆ నీళ్ళు తీసుకొని మొహం కడుకొనేటప్పటికి నా మొహం తెల్లగా పాలిపోయింది ఆ దెబ్బకి.నాకు నచ్చిన విషయం ఎమిటంటే హోటల్లో మాత్రం తాగటానికి వేడినీళ్ళు ఇస్తారు.లేదంటే ఎమయ్యేవాడినో.

ఇది కొడై వెళ్ళే దారిలో.




వెళ్ళినరోజు పొద్దున్నే 5 గంటలకి కొడైలోకి అడుగుపెట్టి టీ తాగటంకోసమని డ్రైవర్ సుమో ఆపి డోరు తీసాడు అంతే చలి మొదలయ్యింది.ఆ డోరు మూసేదాక వూరుకోలేదు.ఇదంతా చదివి మరి చలి తట్టుకోలేని వాడివి అక్కడికి ఎందుకు వెళ్ళవు అనుకుంటున్నారా.ఎంత చలైనా నాకు కొత్త ప్రదేశాలు చూడాలంటే చచ్చేంత ఇష్టం అందుకు.





అదండి కొడై గురించిన మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో మళ్ళి కలుస్తాను అంతవరకు శెలవు.

Saturday, October 13, 2007

కొడైకెనాల్ సరస్సు అందాలు

అందరికి నమస్కారం.ఏంటో కొత్త టపాలు వేద్దామంటే సమయం చిక్కటం లేదు.ఆణిముత్యాలు బ్లాగు మీద శ్రద్ధ ఎక్కువై ఇందులో టపా వెయ్యటం కుదరటం లేదు.సరే మన టపాలోకి వచ్చేస్తున్నా.కొడైలో చలి తట్టుకోవటం నా వల్ల కాలేదు.నేను వేడి తట్టుకుంటాను గాని చలి అసలు తట్టుకోలేను.వెళ్ళిన దగ్గరనుంచి వచ్చే దాక నా పల్లు పట పట కొట్టుకుంటూనే వున్నాయి.




కొడై సరస్సు 5 కి.మీ విస్తీర్ణం కలిగి వుంటుంది.దాని చుట్టూ కాలి నడకన తిరిగేందుకు 45 నిమిషాలు పడుతుంది.ఇది బస్ స్టాండు నుండి 3 కి.మీ దూరంలో వుంది.వేరా లెవింజ్ అనే ఒకప్పటి మదురై కలక్టర్ తన సొంత డబ్బుతో దీనిని కట్టించాడు.ఇది మొత్తం 60 ఎకరాలలో వ్యాపించి వుంది.ఇది వరకు 11.5 మీటర్ల లోతు వుండే ఈ సరస్సు ఇప్పుడు 9 మీటర్లకి కుచించుకు పోయింది.సరస్సులో విహరించటానికి కొడైకెనాల్ బోట్ క్లబ్ & రోయింగ్ క్లబ్ మరియు తమిళనాడు టూరిజం డెపార్ట్మెంట్ వాళ్ళు బోట్లు ఏర్పాటు చేస్తారు.వాటికి 20 నుండి 125 రూపాయల వరకు వసూలు చేస్తారు.




లేక్ దగ్గరే స్వెటర్లు,మొదలగునవి అమ్మే షాపులు వుంటాయి.ఇక్కడ సైకిళ్ళు అద్దెకి ఇస్తారు.అవి తీసుకొని కొడై అంతా తిరగొచ్చు.



ఇక్కడే గుర్రాలు కూడా వుంటాయి ఆసక్తి వున్నవాళ్ళు పిల్ల గుర్రంపై సరస్సు చుట్టు తిరిగితే 100,సగం రౌండ్ కైతే 50 వసూలు చేసారు.ఇప్పుడు ఎంతో నాకు తెలీదు.బోటింగ్ ఉదయం 9 నుంచి సాయంత్రం 5.30 వరకు అనుమతిసారు.ఇక్కడే ఒక పార్కు కూడా వుంది.దాని పేరు బ్రయంట్ పార్క్ అనుకుంట సరిగా గుర్తు లేదు.చాలా అందంగా వుంటుంది.



ఇంకా సరస్సు దగ్గరే రకరకాల చిప్స్,తాజా కేరెట్లు,వేడి వేడి తినుబండారాలు అమ్ముతారు.
కొడై కి సంబంధించిన మరిన్ని సంగతులతో మళ్ళి కలుస్తాను.అంతవరకు శెలవు.

Sunday, October 7, 2007

కొడైకెనాల్




అందరికి నమస్కారం.ఈ సారి అందాల పర్వత యువరాణి కొడైకెనాల్లో మిమ్మలిని విహరింపచేయటానికి మళ్ళీ వచ్చేసా.మేము పుదుక్కొట్టైలో వుండగా కొడైకెనాల్ వెళ్ళాం.నాకు అసలే కొత్త ప్రాంతాలు చూడటమంటే యమ పిచ్చి.అందుకే అందరిని పోరుపెట్టి ఎలాగైతే ఓ పదిమందిమి కలిసి సుమోలో కొడైకెనాల్,పళని,పొల్లాచ్చి చూడటానికి బయలుదేరాం.రాత్రి 11 గంటలకు బయలుదేరితే ఉదయం 5 గంటలకు అక్కడికి వెళ్ళిపోయాం.అక్కడ కాటేజ్ తీసుకొని ఊరు మీద పడ్డాం.ఆ సంగతులు తరువాతి టపాలలో చెప్తాను.ముందు కొడైకెనాల్ గురించి చెప్తాను.



తమిళనాడులోని పశ్చిమ కనుమల్లో కేరళ సరిహద్దు దగ్గర రెండువేలకు పైగా మీటర్ల ఎత్తులో పళని కొండల్లో వుంది.మనదేశంలో అమెరికన్లు ఏర్పాటు చేసిన ఏకైక హిల్ స్టేషన్ ఇదే.పూర్వం గిరిజనులకు మాత్రమే తెలిసిన ఈ ప్రాంతం అమెరికన్ల వాళ్ళే వెలుగులోకి వచ్చింది.అప్పట్లో దక్షిణ తమిళనాడులో వాళ్ళు చాలా క్రైస్తవ మిషనరీలు నడిపేవారు. కాని వాళ్ళు వేడికి తట్టుకోలేక చాలా మంది రోగాల పాలై చాలా ఇబ్బందిపడే వాళ్ళు.దనితో మదురై సమీపంలో ఎదైనా చల్లని ప్రదేశంకోసం వేట ఆరంభించారు.అలా 1845 ప్రాంతంలో ఈ ప్రదేశాన్ని కనుగొన్నరు.




ఒకొక్కళ్ళు వచ్చి అక్కడ నివశించటం మొదలుపెట్టారు.అలా 1860 అక్కడ మొదటి చర్చ్ ను నిర్మించారు.ఇప్పటికి ఆ చర్చ్ అలాగే వుంది.ఒక మేజర్ అప్పట్లో యూకలిప్టస్ మొక్కలు తెచ్చి కొడై అంతా పాతాడు.అందుకే ఇప్పుడు కొడై ఎక్కడ చూసినా అవే కనిపిస్తాయి.ఎత్తుగా ,ఏపుగా వున్న యూకలిప్టస్,ఫైన్ వృక్షాలు కొడైకి వచ్చే వాళ్ళకి స్వాగతం పలుకుతాయి.



1875లో మద్రాసు నుంచి మదురై కి రైలు వెయ్యటంతో ప్రయాణానికి కొంత వెసులుబాటు కలిగింది.తర్వాత 1914 లో కొండ పైకి రోడ్డు మార్గం ఏర్పడింది.



కొడైలో చాలా ప్రదేశాలు కొడై లేక్ సమీపంలోనే వుంటాయి.ఆ సంగతులు మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తరువాతి టపాలలో.అంతవరకు శెలవు.

Monday, October 1, 2007

ద్వారకాతిరుమల(చిన్న తిరుపతి)

అందరికి నమస్కారం.మొన్ననే ద్వారకాతిరుమల వెళ్ళివచ్చాను.ఆ గుడి విశేషాలు మీతో పంచుకుందామని ఇలా వచ్చాను.రాష్త్రంలో తిరుపతి తరువాత అంత ప్రముఖమైన వెంకటేశ్వరక్షేత్రం చిన్న తిరుపతి అనబడే ద్వారకాతిరుమల.పశ్చిమగోదావరి జిల్లాలో అధిక ఆదాయం వచ్చే మొదటి ఆలయం ఇది.దీని చరిత్ర చూద్దాం.




చరిత్ర:

త్రేతాయుగంలో స్వామి ఇక్కడ శేషాకృతిగల కొండపై వెలిశారు.ద్వారకా మహర్షి తపస్సుకు మెచ్చి శ్రీమహావిష్ణువు తనపాదాలను ఆ మహర్షికి ఇచ్చుటచే ఈ క్షేత్రమునకు "ద్వారకాతిరుమల"అని పేరు వచ్చింది. త్రేతాయుగంలో శ్రీరాముని తాతగారైన అజమహారాజు,తండ్రి అయిన దశరధుడు,స్వయముగా శ్రీరాముడు స్వామిని సేవించినట్లు పురాణాలలో వుంది. మైలవరం జమిందారులు సూరానేని వంశీయులు వంశపారంపర్య ధర్మకర్తృత్వం వహించేవారు.ఈ మధ్యే ధర్మకర్తృత్వానికి ఎన్నిక పెట్టాలని అనుకుంటున్నారు.


ఆలయ విశేషాలు:



ఇక్కడ స్వామి దక్షిణాభిముఖులై వుంటారు.ఇక్కడ శ్రీనివాసుని పాదాలు పుట్టలోనున్న ద్వారకునిచే పూజించబడుటచే స్వామిని సేవించుకొను భక్తులకు ఆ పాదాలు కనిపించవు.కనుక ధృవమూర్తికి వెనుకభాగమున పీఠంపై సంపూర్ణ శిలావిగ్రహమును ప్రతిష్టించారు.ఇలా ఒకే విమానం కింద రెండు ధృవమూర్తులు వుండటం విశేషం.రెండు ధృవమూర్తులు ఉండటం వల్ల ఏడాదికి రెండుసార్లు కళ్యాణ మహోత్సవములు జరుగుతాయి. మొక్కులు మొక్కుకొని పెద్దతిరుపతి పోలేని భక్తులు ఇక్కడ మొక్కులు తీర్చుకోవచ్చని అంటారు.ఇక్కడ స్వామికి కోపం ఎక్కువని ఇక్కడ మొక్కుకొని మొదట ఇక్కడకు రాకుండ పెద్దతిరుపతి వెళ్ళి తర్వాత ఇక్కడికి వస్తే స్వామికి కోపం వస్తుందని అంటారు.ప్రాకారం నాలుగు దిక్కుల నాలుగు గోపురాలు వున్నాయి.వీటిలో దక్షిణ ద్వారము వైపు గల గోపురం పెద్దది.దీనికి 5 అంతస్తులు వున్నాయి.



స్వామివారి సన్నిధి కుడివైపు అలివేలు మంగతాయారు,ఆండాళ్ అమ్మవార్ల ఆలయాలున్నయి.ధ్వజస్తంభానికి వెనుక భాగాన్న స్వామివారికి ఎదురుగా భక్తాంజనేయ,గరుడాళ్వార్ల ఆలయం వుంది.భక్తులు తలనీలాలు సమర్పించటానికి ఆలయం బయట పడమర వైపు కళ్యాణకట్ట వుంది.తూర్పువైపు ప్రసాదాల కౌంటర్ వుంది. ఆలయం తొలిమెట్టు వద్ద పాదుకామండపం వుంది.ఇక్కడ స్వామివారి పాదాలు వుంటాయి.


గుడిలోకి వెళ్ళే ముందు ఇక్కడ దణ్ణం పెట్టుకొని వెళ్ళటం సాంప్రదాయం.మెట్లకు తూర్పువైపున అన్నదాన సదనం వుంది.ఊరికి ముందు మనకు గరుడాళ్వారుని భారి విగ్రహం కనిపిస్తుంది.అలాగే టి.టి.డి వారి కళ్యాణ మండపం వద్ద భారి ఆంజనేయ విగ్రహం వుంది.






ఆలయ ఆధ్వర్యంలోనే కాక ఇతరులు కూడా కళ్యాణ మండపములు నడుపుతున్నారు.పెళ్ళిళ్ళ సీజన్లో ఊరు కలకలలాడుతూ వుంటుంది.

కళ్యాణాలు:

వైశాఖ మాసంలో దశమి నుంచి విదియ వరకు ఒకసారి,ఆశ్వీజమాసంలో విజయదశమి నుంచి విదియ వరకు రెండో సారి ఘనంగా జరుగుతాయి.ఇది కాక భోగి రోజున గోదాకళ్యాణం జరుగుతుంది.

వేళలు:

ఉదయం 6 గంటలనుండి మధ్యానం 1 గంటవరకు.తిరిగి 3 గంటల్నుంచి రాత్రి 9 గంటలవరకు.

ప్రయాణం:

మద్రాస్ నుండి కలకత్తా వెళ్ళే జాతీయరహదారిలో భీమడోలుకు 17 కిలోమీటర్లలోను,తాడేపల్లిగూడానికి 47 కి.మీ.,ఏలూరు కి 41 కి.మీ దూరంలో వుంది.ఏలూరు,తాడేపల్లిగూడెం స్టేషన్లలో అన్ని ఎక్స్ ప్రెస్స్ రైళ్ళు ఆగుతాయి.భీమడొలు స్టేషన్లలో తిరుమల,సింహాద్రి ఎక్స్ ప్రెస్స్లు పాసింజర్లు ఆగుతాయి.జిల్లలోని అన్ని ముఖ్యపట్టణాలనుంచే కాకుండా విజయవాడ,రాజమండ్రి,మచిలిపట్ణం నుంచి ప్రతి శనివారము మరియు ప్రత్యేక దినములలో బస్సులు వెళ్తాయి. హైదరాబాదునుంచి కూడా ఎ.పి.టూరిజం వాళ్ళు బస్సు నడుపుతున్నారు. దేవస్థానం వారి సమాచార కార్యాలయం పాదుకామండపం దగ్గర వుంది.ఉండటానికి అనేక సత్రాలు,అతిధి గృహాలు వున్నాయి.

చుట్టుపక్కల చూడదగ్గ ప్రదేశాలు:

మద్ది ఆంజనేయస్వామి దేవాలయం:

ఇది ఇక్కడినుంచి జంగారెడ్డిగూడెం వెళ్ళే మార్గంలో గురవాయిగూడెం లో వుంది.ఈ ఆలయం చాలా విశేషమైనది.స్వామి మద్ది చెట్టుకింద వెలిసారు.తప్పక చూడవలిసిన ప్రదేశం.

రేణుకాదేవి(కుంకుళ్ళమ్మ) ఆలయం:

ఇక్కడినుంచి 1కి.మీ.దూరంలో భీమడోలు మార్గంలో వుంది.ఈ అమ్మవారు ప్రయాణంలో భక్తులకు కష్టాలు కలగకుండా చూస్తారని నమ్మకం.

కొసమెరుపు:మూడుసార్లు ఈ గుడికి వెళ్ళానుగాని ఇంతవరకు పెద్ద తిరుపతి వెళ్ళే భాగ్యం కలగలేదు.