Friday, June 17, 2011

ఇదీ నా కథ -- మల్లెమాల


సినిమా ప్రపంచం. వెన్నెల లోకం. జనానికి వెలుగులు పంచినా, ఎందరి జీవితాల్లోనో చీకటినే మిగిల్చే రంగుల ప్రపంచం. ఇక్కడ కోట్ల కొద్దీ డబ్బులుంటాయి..విశాలమైన సెట్లుంటాయి.. స్టూడియోలుంటాయ.. బంగ్లాలుంటాయ..కానీ మనుషుల హృదయాలు మాత్రం విశాలంగా వుండవు. పరుగు పందెంలో జారిపడ్డవాడిని లేపేవాడుండడు. ఇది ఇవ్వాళ కొత్తగా తెలిసిన సంగతో, వెలుగులోకి వచ్చిన విషయమో కాదు. ఇక్కడే బంగరు బతుకు బతికిన సావిత్రి, రాజనాల, సిఎస్‌రావు, సలీం, ఇంకా ఎందరో..ఎందరో ఆపై ఇబ్బందుల జీవితాన్ని అనుభవించారు. నిన్నటి వరకు బెంజ్ కారులో తిరిగినవాడు, వున్నట్లుండి బొత్తాలు లేని చొక్కాతో తిరగాల్సిన పరిస్థితి రావచ్చు. ఇది స్వయంకృతాపరాధం కావచ్చు.. మరేదైనా కావచ్చు. కానీ ఇక్కడ ‘అయ్యో’ అన్న మాట వినిపించదు..అన్నిటికీ మించి, సినీమాయాలోకంలో కనిపించనది ‘కృతజ్ఞత’. ఎక్కి వచ్చిన మెట్లను మరిచిపోయేంత మైమరపు, ఇక్కడి జనాలకు సర్వసాధారణం.
‘‘ నా జీవనయానంలో అనేక పాత్రలు అడుగడుగునా నాతో కలిసి నడుస్తాయి..
‘‘...చలన చిత్ర నిర్మాతలున్నారు..దర్శకులున్నారు. నటీనటులున్నారు..చేయూత నిచ్చినవాళ్లున్నారు..చెయ్యిచ్చినవాళ్లున్నారు..నమ్మదగిన వాళ్లున్నారు..నయవంచకులున్నారు..’’
‘‘..కృతజ్ఞత అన్న పదం సినిమా నిఘంటువులో కాగడాపెట్టి వెదికినా కనిపించదన్న నిజం తెలుసుకున్నాను. వ్యక్తిత్వాన్ని కాపాడుకోలేకపోయాను. కొన్ని చీకటి తప్పులు చేసాను..’’
ఈ మాటలు ఎవరివో కావు. దాదాపు గడచిన నాలుగున్నర దశాబ్దాల కాలంగా తెలుగు సినిమా చిత్రరంగంతో నిర్మాతగా, రచయితగా, నటుడిగా, ఇంకా అనేక విధాల మమేకమైపోయిన మల్లెమాల సుందరరామిరెడ్డి అనే ఎమ్‌ఎస్ రెడ్డి తన ఆత్మకథలో రాసుకున్న మాటలు. ఆయన తన ఆత్మకథను ఎటువంటి ఆత్మవంచన, మొహమాటం లేకుండా ఇటీవల వెలువరించారు. సినిమా రంగంలో తానెదుర్కున్న ఆటుపోట్లను, తన కెదురైన రకరకాల పాత్రలను ఆయన ధైర్యంగా పరిచయం చేసారు. వాటిలో ఆయన నిజాయతీ రాసారని, అన్నీ నిజాలనీ అనుకున్న తక్షణమే..కచ్చితంగా తెలుగుసినీ రంగం మాయాలోకమే అనిపించక మానదు. మల్లెమాల పుస్తకంలో పలువురు సినీరంగ పెద్దల గురించి రాసిన విషయాలను చదివితే....
నా ఏడ్పు నేనేడ్చుకుంటా...
నీ ఏడ్పు నువ్వేడ్చుకో...
‘‘..ప్రఖ్యాత నటి జమున నాకు ఫోనుచేసి రెడ్డిగారూ! ఒకసారి మా ఇంటికి రాగలరా! అన్నది. నేను వెళ్లాను. రామారావుగారు కృష్ణుడుగా, నేను సత్యభామగా నటించిన అన్ని పిక్చర్లు, ఘనవిజయం సాధించాయి. మీ పిక్చర్లో కూడా సత్యభామగా నేనే నటించాలి అన్నది. మీరు నటిస్తానంటే నేను కాదంటానా? అన్నాను అందుకామె సంతోషిస్తూ టైటిల్స్‌లో తన పేరు ముందు వెయ్యాలని షరతుపెట్టింది. మా చిత్రంలో ప్రధాన పాత్రధారి జయలలిత. అందువల్ల మీ పేరు ముందు వెయ్యడం కుదరదని నిర్మొహమాటంగా చెప్పాను. ఆమె పిక్చర్ వదులుకోలేక, ఐతే మిగతా ఆర్టిస్టులందరి పేర్ల తర్వాత ‘‘మరియు సత్యభామగా జమున’’ అని ప్రత్యేకంగా ఒక కార్డు వేయించండి అన్నది. ఆ పని తప్పక చేస్తానని చెప్పాను..’’
‘‘..చిత్ర నిర్మాణంలో పెద్ద ఆర్టిస్టుల మూలంగా ఎదురయ్యే చిక్కులు అన్నీ ఇన్నీ కావు. మొదటి సమస్య రామారావు గారితోనే ఎదురైంది. అది పౌండ్రక వాసుదేవుని సెట్టు. నాగభూషణంగారు ఉదయం తొమ్మిది గంటలకే సెట్టుకు వచ్చి పౌండ్రక వాసుదేవుని గెటప్‌లో సింహాసనం మీద కూర్చున్నారు.
రామారావుగారు ఇంటివద్దనే మేకప్ వేసుకుని స్టుడియోకి వచ్చారు. నేను సగౌరవంగా కారు డోర్ తెరిచి సెట్‌లోకి పంపాను. రామారావుగారు సెట్‌లోకి అడుగుపెట్టగానే ఆర్టిస్టులందరూ లేచి విష్ చేస్తారు. కానీ నాగభూషణంగారు మర్యాదకోసమైనా సింహాసనం మీదనుండి లేవలేదు. దానికితోడు ఆయన వేషధారణ శ్రీకృష్ణుడ్ని అనుకరిస్తూ ఉండడం చూసి రామారావుగారు అంతులేని ఆగ్రహంతో కామేశ్వరరావుగారిని పిల్చి ‘హూ ఈజ్ దట్ ఫెలో’ అన్నారట.
నాగభూషణం గారని కామేశ్వరరావుగారు బదులిచ్చారట. మేమడిగింది ఏ భూషణంగాడని కాదు. వాడి వేషమేమిటి? ఆ కిరీటమేమిటి? ఆ నెమలి పింఛమేమిటి? ఆ శంఖ చక్రాలేమిటి బారెడు పొడుగున ఆ మురళి ఏమిటి అని గద్దించారట.
అతను పౌండ్రక వాసుదేవుడు. వేషభాషలన్నిటిలోను శ్రీకృష్ణుడ్ని అనుకరిస్తూ నేనే అసలైన వాసుదేవుడ్ని అని ప్రచారం చేసుకోవడమే కాకుండా కృష్ణ భక్తులందరినీ హింసిస్తుంటాడు అని కామేశ్వరరావు గారనగానే రామారావుగారు చాలు అక్కడితో ఆపండి అంటుండగా నేను లోపలికి వెళ్లాను. రామారావుగారు నా వంక చురచుర చూస్తూ మేము చాలా పౌరాణిక చిత్రాల్లో నటించాం. వీడెప్పుడూ మాకు తగల్లేదే. వాడి వేషధారణ చూశాక ఇక మాకీ గెటప్ ఎందుకు? అర్జెంటుగా ఒక ప్యాంటు షర్టు తెప్పించండి. ఆ డ్రస్‌తోనే నటిస్తాం అన్నారు.
మీరెలా నటిస్తానంటే నాకేం ఆక్షేపణ కాదు. ఈరోజు ఇంతటితో షూటింగ్ ఆపుచేద్దాం! రేపు ఉదయం మీరు స్టుడియోకి వచ్చేటప్పటికి సోషల్ డ్రస్ సిద్ధం చేయిస్తానన్నాను. అందుకాయన రెట్టించిన స్వరంతో పరిహాసమా! అన్నారు. కాకపోతే ఏమిటండి. పౌండ్రక వాసుదేవుడనేది భాగవతంలో ఒక సుప్రసిద్ధమైన పాత్ర. మీరా విషయం తెలుసుకోకుండా మాటిమాటికీ హూ ఈజ్ దట్ ఫెలో? హూ ఈజ్ దట్ ఫెలో? అంటున్నారు. వాడి ఆగడాలు భరించలేక చివరికి మీరే అతన్ని సంహరిస్తారు ఇదే సెట్‌లో అన్నాను గట్టిగా. దాంతో రామారావుగారు చల్లబడి నా డౌట్ క్లియర్ అయింది. ఇక అందరం కలిసి సరదాగా పనిచేసుకుందాం అన్నారు..’’
‘‘..సినిమా పరిశ్రమలో కాస్త పేరున్న ప్రతి ఆర్టిస్టుకు కొంత ఇగో ఉంటుంది. ‘శ్రీకృష్ణ విజయం’లో జమున, జయలలిత ఇద్దరూ నటిస్తున్న సంగతి మీకు తెలుసు. జమున మొదటిసారిగా సత్యభామ వేషంలో సెట్‌లోకొచ్చింది. అప్పటికే సెట్‌లో వున్న జయలలిత ఒక మూల కూర్చుని ఏదో ఇంగ్లీషు నవల చదువుకుంటూ ఉంది.
జమున ఆమెవంక కోపంగా చూస్తూ జయలలిత! నేను సీనియర్ నటిని. లేచి విష్ చేయాలన్న జ్ఞానం కూడా లేదా! అన్నది. నాకా ఫార్మాలిటీస్ లేవు అన్నది జయలలిత. దాంతో జమున రుసరుసలాడుతూ వెళ్లి మరొక కుర్చీలో కూర్చుంది.
డైరక్టర్ షాట్ రెడీ చేశారు. ఆ సన్నివేశంలో జయలలిత దుఃఖం అభినయించాలి. ఆమె దర్శకుడి సూచన మేరకు అలాగ నటిస్తూ ఉంది. జయలలిత తనకంటే ఎక్కువ మార్కులు కొట్టేస్తుందని భావించిన జమున నువ్వు అంత గట్టిగా ఏడిస్తే నా డైలాగు ఏం కావాలి? అని గద్దించింది. నా ఏడుపు నేను ఏడ్చాను. నీ ఏడుపేదో నవ్వేడ్చుకో అన్నది జయలలిత కోపంగా.
దాంతో జమున అగ్గిమీద గుగ్గిలమైంది. కామేశ్వరరావుగారూ! నా మూడ్ ఔటయింది. ఈ రోజు నేనిక యాక్ట్ చేయలేనంటూ మేకప్ రూమ్‌లోకి వెళ్లి శ్రీకృష్ణ తులాభారంలో సత్యభామలాగా ఆభరణాలన్నీ తీసిపారేసింది. ఇంతలో నేనామె రూమ్‌కి వెళ్లాను. జమున నన్ను చూడగానే అంతమంది ముందు అది నన్ను అంత చులకనగా మాట్లాడుతుంటే మీరు చూస్తూ ఊరుకోవడం నాకు బాధవేసింది. ఏం చూసుకుని దానికంత పొగరు అన్నది. కారణమేదైనా ఆ సాకుతో అర్ధాంతరంగా నువ్వు ఈ రోజు నేను యాక్ట్ చేయలేనంటే నా షూటింగ్ ఏం కావాలి. నువ్వు తెగిందాకా లాగితే నేను ఆర్టిస్టును మార్చుకోవలసి వస్తుంది అన్నాను కఠినంగా. ఆ మాటతో ఆమె చల్లబడి మీరు పదండి నేను పది నిముషాల్లో సెట్లో ఉంటానన్నది.
‘‘..నా భార్య వెళ్లిన పని ఏమైందని ఆదుర్దాగా అడిగింది. ఎన్టీఆర్ ఇంతవరకు కిందికి రాలేదన్నాను. ఐతే ఇప్పటివరకు ఎక్కడ కూర్చున్నారన్నదామె. ఇంకెక్కడ కూర్చుంటాను. ఆఫీసు ముందున్న చెక్కబల్లమీదే కూర్చున్నానన్నాను. వెంటనే ఆమె కన్నీటి పర్యంతమై ఎంతకు దిగజారారండి. ఊళ్లో సింహంలా బతికారు. ఇక్కడకొచ్చి ఏం బావుకున్నాం! అదేమంటే పిల్లలు పెళ్లికెదుగుతున్నారు. డబ్బు కూడా కావాలిగా అంటారు. ఆత్మను చంపుకుని సంపాదించే డబ్బు మనకక్కరలేదు. రామారావుగారు మహానటుడే. కాదనను. ఆయనతోపిక్చర్ తీసినంత మాత్రాన శ్రీ మహాలక్ష్మి మనింట్లో కాపురం పెడుతుందా!
తీశారుగా ‘శ్రీకృష్ణ విజయం’ అష్టకష్టాలు పడి. ఏమొచ్చింది అందులో. మీరు పొట్ట చేతపట్టుకుని మద్రాసు రాలేదు. ఆర్టిస్టుల ఇళ్లముందు పడికాపులు కాయడం నాకిష్టంలేదు. నా మాట కాదని మీరు రామారావుగారితోనే పిక్చర్ తీస్తానంటే నేను రేపే పిల్లల్ని తీసుకుని ఊరెళ్లిపోతానన్నది. ఎన్నో ఏళ్లుగా కష్ట నష్టాలను లెక్కచేయకుండా నాతో కలిసి నడిచిన ఇల్లాలి మనసు నొప్పించడం ఇష్టంలేక నేను అలాగేనని మాటిచ్చాను.
ఇంతలో ఫోన్ మోగింది. నేనే ఎత్తుకున్నాను. అప్పటికే లైన్లో ఉన్న రామారావుగారు రెడ్డిగారూ! ఏమిటి అర్ధాంతరంగా వెళ్లిపోయారన్నారు. నేను ఉదయం 4.50 నిముషాలకే వచ్చి ఐదున్నర దాకా వెయిట్ చేశాను. ఇక ఆ చీకట్లో కూర్చోలేక వచ్చేసాననగా సారీ రెడ్డిగారు! బంధువులెవరో వస్తే వాళ్లతో మాట్లాడుతూ మీ మాట మర్చిపోయాను. మీరక్కడే ఉండండి. నేనే డైరీ తీసుకుని మీ వద్దకు వస్తున్నానన్నారు.
మీరు మా ఇంటికి రావడమేమిటి సార్, నేనే వస్తున్నానని చెప్పి ఐదు నిముషాల్లో తిరిగి రామారావుగారింటికి వెళ్లాను. ఇంట్లో జరిగిందంతా వారికి చెప్పి నా భార్య ఒక మొండి మనిషి. ఆమె మనసు నొప్పించలేక మీతో పిక్చర్ తీయనని మాటిచ్చాను. దయచేసి నన్ను అపార్ధం చేసుకోకండి. నేను మీతో పిక్చర్ తీయకపోయినా సినిమా పరిశ్రమలో ఉన్నంత కాలం మీ అనుచరుడుగానే ఉంటానని చెప్పాను. నేనెన్ని చెప్పినా ఆయన దానిని అవమానంగానే భావించారు.
అలా భావించడంలో తప్పులేదు. చలన చత్ర పరిశ్రమను మకుటం లేని మహారాజుగా ఏలుతున్న వ్యక్తి రామారావుగారు. అలాంటివారు అడగకుండానే కాల్‌షీట్స్ ఇస్తానంటే తిరస్కరించడం ఆయనకు బాధ కలిగించింది. ఒక్కక్షణం వౌనంగా కూర్చున్నారు. తర్వాత ఆల్‌రైట్ మీ ఇష్టమొచ్చిట్టే కానివ్వండన్నారు గంభీరంగా. నేను మరోసారి ఆయనకు క్షమాపణ చెప్పి ఇల్లు చేరాను..’’
‘‘...1974వ సంవత్సరం ఫిబ్రవరి 11వ తేదీ రాష్టప్రతి గారికి చిత్రం చూపించడం కోసం అపాయింట్‌మెంట్ తీసుకున్నాను. దురదృష్టవశాత్తు ఆ దినం ఉదయమే ఘంటసాల గారు స్వర్గస్థులయ్యారు. వారితో నాకున్న అనుబంధం కొద్దీ దహనక్రియలు పూర్తికాక ముందు ఢిల్లీ వెళ్లడానికి మనసొప్పలేదు. అప్పుడు ఎన్.టి.రామారావుగారు, అక్కినేని నాగేశ్వరరావుగారు హైదరాబాద్‌లో ఉన్నారు. వారికి టెలిఫోన్ ద్వారా ఘంటసాలగారి మరణవార్తను తెలియజేసి సాయంత్రం దాకా ఎదురు చూశాం. కాని ఇద్దరూ రాలేదు. ఇక లాభం లేదని ఆరు గంటలకు శవయాత్ర ప్రారంభించాం..’’
‘‘....‘నాయుడు బావ’ పిక్చర్ విడుదలైన తర్వాత సుమారు నెలరోజులకు కెమెరామెన్ దేవరాజు ఎమ్మెస్ రెడ్డిగారి నెక్స్ట్ పిక్చర్‌కు నేను కెమెరామెన్ అని పత్రికలో ప్రకటించాడు. నాకాశ్చర్యమేసింది. తక్షణం దేవరాజును పిలిచి నా అనుమతి లేకుండా ఎందుకలా ప్రకటించావని నిలదీశాను.
శోభన్‌బాబు నిన్న ఉదయం నాతో రెడ్డిగారి నెక్స్ట్ పిక్చర్ నువ్వు చేసుకోమని చెప్పాడు. ఆ ధైర్యంతోనే పత్రికలో ప్రకటించాను సార్! అన్నాడతను. నేను శోభన్‌బాబుకి ఫోన్ చేసి కెమెరామెన్ దేవరాజు ఇలా ప్రకటించాడేమిటి? అన్నాను.
నేనే చెప్పాను సార్! దేవరాజు కూడ ఇండస్ట్రీలో పేరున్న వాడేగా అన్నాడు. అంటే ప్రకాశ్ కంటే గొప్పవాడా అన్నాను. ఆ మాట నేననను కానీ ప్రకాశ్‌కి పొగరెక్కువ. సెట్‌లోకి రాగానే నేను ఎదురుగా వున్నా నాకు నమస్కారం పెట్టకుండా నేరుగా కెమెరా వద్దకు వెళ్తాడన్నాడు. నిన్ను విష్ చేయలేదన్న కారణంగా నేను ప్రకాశ్‌ను వదులుకోనని ఫోన్ పెట్టేశాను. దాంతో అతనికి వేడెక్కింది. ‘రామబాణం’ పిక్చర్ చేయనని అడ్డం తిరిగాడు.
నిర్మాతకు, ఆర్టిస్టుకు మధ్య తగాదా వస్తే ఆర్టిస్టుల అసోసియేషన్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కలిసి విచారించి పరిష్కరించడం ఆనవాయితీ. నేను శోభన్‌బాబు ఉదంతాన్ని నిర్మాతల మండలి ముందుంచాను. డివిఎస్ రాజుగారు ఆర్టిస్టుల అసోసియేషన్‌తో చర్చించి రెడ్డిగారి నిజాయితీ మనందరికీ తెలుసు. శోభన్‌బాబు రెండు పిక్చర్లకు కలిసి అడ్వాన్స్ తీసుకుని ఇప్పుడు రెండో పిక్చర్ చేయననడం తప్పని ఆ సమావేశంలో నిర్ణయించడంతో పాటు ఇచ్చిన మాట తప్పినందుకు తగిన మూల్యం చెల్లించే వరకు ఏ నిర్మాతా అతనితో పిక్చర్ తీయకూడదని జాయింట్ కమిటీ నిర్ణయించింది.
ఆ కారణంగా శోభన్‌బాబు నాలుగైదు రోజులు మేకప్ లేకుండా ఇంట్లో కూర్చోవాల్సి వచ్చింది. నిర్మాణం మధ్యలో వున్న నిర్మాతలు కూడా వారికి జరిగే నష్టాన్ని లెక్కచేయకుండా ఒక్కమాట మీద నిలబడ్డారు. దాంతో శోభన్‌బాబు తలతిరిగిపోయి మళ్లీ డివిఎస్ రాజుగారినే ఆశ్రయించాడు.
రాజుగారు నువ్వు చేసింది తప్పు బాబు. సమస్య సామరస్యంగా పరిష్కారం కావాలంటే రెడ్డిగారి తదుపరి చిత్రంలో కూడా అన్నమాట ప్రకారం నువ్వే నటించాలి. ఇచ్చిన మాట తప్పినందుకు ఎంతో కొంత అపరాధ సుంకం చెల్లించాలని చెప్పారు. గత్యంతరం లేని స్థితిలో శోభన్‌బాబు రెండు షరతులకూ ఒప్పుకుని అపరాధ సుంకం కింద కొంత పైకం చెల్లించాడు...’’
‘‘...తర్వాత చిరంజీవి హీరోగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తిరుపతిరెడ్డి నిర్మించిన ‘ఖైదీ’ చిత్రం అఖండ విజయం సాధించి ఆయన నట జీవితానికి జయపతాకగా నిలిచింది. అల్లురామలింగయ్యగారు ఒకరోజు నన్ను కలిసి రెడ్డిగారూ ‘తాతయ్య ప్రేమలీలలు’ చిత్రంలో మీరు విపరీతంగా నష్టపోయారు. హీరోగా చిరంజీవి ఇప్పుడు టాప్‌లో ఉన్నాడు. ఒకటికిరెండుసార్లు మీరు వెళ్లి కలవండి. నేను కూడా మీకొక చిత్రం చెయ్యమని గట్టిగా చెప్తాను. తప్పకుండా ఒప్పుకుంటాడని చెప్పారు. నేనాయన చెప్పిన ప్రకారం నాలుగైదుసార్లు చిరంజీవిని కలిసాను. కానీ ఆయన నాతో మాట్లాడేందుకు కూడా ఇష్టపడలేదు...’’
‘‘..అంజయ్యగారి జంబోజెట్ మంత్రివర్గంలో చంద్రబాబునాయుడు సభ్యుడుగా ఉన్నాడు. ఒకరోజు ఎన్.టి.రామారావుగారు నన్ను పిలిచి మా అమ్మాయి భువనేశ్వరిని చంద్రబాబునాయుడికి ఇవ్వాలనుకుంటున్నాను. ప్రస్తుతం ఆయన మంత్రిగా ఉన్నాడు. రాజకీయంగా మరింత ఎదిగే అవకాశముంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. పెళ్లి విషయంలో మీరు కొంత బాధ్యత తీసుకోవాలి అన్నారు. నేనేం చెయ్యాలో చెప్పండన్నాను.
బాబు తరఫున చిత్తూరు జిల్లానుండి వారి అనుచరులు అధిక సంఖ్యలో వస్తారు. వాళ్లందరికీ వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయడంతోపాటు బంధుమిత్రులకోసం దగ్గరగా ఉండే హోటల్లో పది గదులు రిజర్వు చేయించండి అన్నారు. చిత్తూరు జిల్లానుండి వచ్చే వాళ్ల బాధ్యతను మాగుంట సుబ్బరామిరెడ్డిగారికి అప్పగించాను. బంధుమిత్రుల బాధ్యత నేను భుజాన వేసుకున్నాను. టీనగర్‌లోని శ్యాం హోటల్లో పది గదులు రిజర్వు చేయించాను. మరుసటిరోజు రాత్రి రామారావుగారి స్థాయికి తగ్గట్టు పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.
తర్వాత శ్యాం హోటల్ మేనేజర్ రెండు రోజుల బిల్లు నా వద్దకు పంపించాడు. ఆ బిల్లు రామారావుగారి చేతికి ఇచ్చాను. నా బిడ్డ పెళ్లికి అది మీ వాటా అనుకోండి అని నా భుజం తట్టారు. ఇక తప్పదని నేనే చెల్లించాను. చిత్తూరు జిల్లానుండి తరలివచ్చిన వేలాదిమంది బిల్లంతా మాగుంట సుబ్బరామిరెడ్డిగారు భరించారు. తర్వాత రామారావుగారు ఒకరోజు నన్ను పిలిచి మేం హైదరాబాద్‌లో 20 ఎకరాల తోట భూమి కొన్నాం. అందులో నాటేందుకు రెండువేల నిమ్మ మొక్కలు కావాలి. మీ ఊరిలో మంచివి దొరుకుతాయని తెలిసింది అనగానే అది నిజమే. ప్రస్తుతం నిమ్మనారు మా వద్ద లేదు, ఎవరివద్దనైనా కొని పంపించాల్సిందే అన్నాను. ఆయన వెంటనే మీ వద్దలేనప్పుడు కొనక తప్పదు కదా అన్నారు. నేను మద్రాసునుండి మా చిన్నతమ్ముడు సుబ్బరామిరెడ్డికి ఫోన్ చేసి నిమ్మనారు మంచిది చూసి ఎవరివద్దనైనా రెండువేల మొక్కలు కొని జాగ్రత్తగా ప్యాక్ చేయించి లారీ ద్వారా హైదరాబాద్‌కు తీసుకుని వెళ్లి రామారావుగారి పెద్దకుమారుడికి అప్పచెప్పి రమ్మని చెప్పాను.
వాడు నా మాట కాదనలేక అదే ప్రకారం లారీలో నిమ్మనారు తీసుకుని హైదరాబాద్‌లోని రామారావుగారి కుమారుడు జయకృష్ణ వద్దకు వెళ్లాడు. అతను లారీ బాడుగ కానీ, నిమ్మనారు ఖరీదుకానీ పైసా ఇవ్వకపోగా మీరే స్వయంగా వెళ్లి తోటలో నాటించాలి అన్నాడట. ఆ సంగతి తమ్ముడు నాకు ఫోన్ చేసి చెప్పాడు. నేను మా డిస్ట్రిబ్యూటర్‌ను అడిగి డబ్బు తీసుకుని లారీ బాడుగ, నాటేందుకు అయ్యే ఖర్చులు చెల్లించి పని పూర్తి చేసుకుని రా! తర్వాత నారు కొనుగోలుతో సహా మొత్తం ఖర్చు ఎంతయింది నాకు చెప్పు. నేను రామారావుగారిని అడిగి తీసుకుని నీకు చేరుస్తాను అన్నాను.
వాడు అదే ప్రకారం నాటించి తిరిగి ఊరికి రాగానే అన్ని ఖర్చులు కలిసి నాలుగువేల రెండువందలు అయిందని నాకు జాబు రాశాడు. నేను ఆ జాబు రామారావుగారికిచ్చాను. వెంటనే ఆయన మీ తమ్ముడిగారికి ఏం తెలుసు మనిద్దరి అనుబంధం. పాపం పసివాడు కదా అంటూ షూటింగ్‌కు వెళ్లిపోయాడు. చేసేది లేక నాలో నేను నవ్వుకున్నాను...’’
‘‘..అది 1994వ సంవత్సరం నేను శబ్దాలయనుండి కారులో వెడుతుండగా మా గేటుదగ్గర ఒక అనామకుడు నిల్చుని నాకు నమస్కారం పెట్టాడు. నేను కారు ఆపి నీ పేరేమిటి అన్నాను. నా పేరు గుణశేఖర్ సార్. నేను రామ్‌గోపాల్‌వర్మ గారి దగ్గర అసోసియేట్‌గా పనిచేశాను. తెలుగులో రెండు చిత్రాలు డైరక్టు చేశాను. కాని అవి నన్ను నిరుత్సాహపరిచాయి. దాంతో ఏ నిర్మాతా నాకు అవకాశం ఇవ్వలేదు. తిరిగి ఊరికి వెళ్లలేక కొంతమంది మిత్రుల సహాయంతో నలభై లక్షల్లో ‘సొగసు చూడతరమా’ అనే చిత్రం తీసాను. ఆ చిత్రాన్ని మీకు చూపించాలని వచ్చాను అన్నాడు.
ఒకరోజు గుణశేఖర్ మా ఆఫీసుకు వచ్చి మన బ్యానర్లో నాకొక అవకాశమివ్వండని బతిమాలాడు. అలాగే ఇస్తాను. నీ దగ్గరేదైనా మంచి సోషల్ సబ్జెక్టుంటే తీసుకురా అన్నాను. అతను థాంక్యూ సార్ అంటూ వెళ్లిపోయాడు.
తర్వాత నాలుగు రోజులకే నావద్దకువచ్చి సార్! నేను బాగా ఆలోచించాను. సోషల్ పిక్చర్ కన్నా పిల్లలతో రామాయణం నిర్మిద్దామన్నాడు. నేను ఆలోచనలో పడ్డాను. మర్నాడే మద్రాసు వెళ్లి కె.ఎస్ ప్రకాశరావుగారిని కలిసాను. ఆయన అంతకు ముందు పిల్లలతో ‘బూరెల మూకుడు’, ‘కొంటె కృష్ణుడు’, ‘రాజయోగం’ అన్న మూడు కథలను కలపి ‘బాలానందం’ అన్న పేరుతో స్వీయ దర్శకత్వంలో ఒక చిత్రం నిర్మించి ఉన్నాడు. గుణశేఖర్ ప్రపోజల్ ఆయనకు చెప్పి సలహా అడిగాను. ప్రపోజల్ మంచిదే. పిల్లలతో రామాయణం తీస్తే చూస్తారా? లేదా? అన్న సందేహం మీకక్కరలేదు. ఈ కాలం పిల్లలు చాలా తెలివైన వాళ్లు. దర్శకుడు గట్టివాడయితే పిల్లలు ఏ పాత్రనైనా అవలీలగా పోషించగలరు.
ఐతేపిల్లల చిత్రానికి స్ట్టూడియోల్లో వున్న సెట్స్ ఏవీ పనికిరావు. ఆభరణాలు, ఆసనాలు, దుస్తులు వగైరాలన్నీ పిల్లలకు సరిపడే విధంగా ప్రత్యేకంగా తయారు చేయించాల్సిందే! బడ్జెట్ విషయం మీరు చూసుకోండని సలహా ఇచ్చారు ప్రకాశరావుగారు.
నేను తిరిగి హైదరాబాద్ చేరుకోగానే గుణశేఖర్‌ను, ఆర్ట్ డైరక్టర్ భాస్కరరాజును పిలిపించి ప్రకాశ్‌రావుగారు చెప్పిన వివరాలన్నీ చెప్పి బడ్జెట్ ఎంత అవుతుందన్నాను. పిల్లలెవరికీ పారితోషికం ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి ఖర్చు ఎనభై లక్షలకు మించదన్నాడు గుణశేఖర్. అతనామాట చెప్పినా నేను కోటి రూపాయలు వెచ్చించేందుకు సిద్ధపడ్డాను..’’
‘‘...మరుసటి రోజు నేను, గుణశేఖర్ ఆఫీసు ముందున్న గదిలో కూర్చుని ఏదో చర్చించుకుంటుండగా ‘తారక్’ ఆటోలో గేటువద్ద దిగి నేరుగా నడిచి మా వద్దకు వచ్చాడు. ఆ నడకలో ముగ్ధమోహనాకారుడైన రాముడు నాకగుపించాడు.
నా పేరు తారక్ సార్. మమీ చెప్పింది మీరు రమ్మన్నారని. రాముడు వేషంకోసం. దయచేసి మీరు అవకాశమిస్తే నేను మా తాతగారిలాగ నటిస్తానన్నాడు. ఆ సంగతి తెలిసే నిన్ను పిలిపించాను. మా పిక్చర్లో నువ్వే రాముడివి. వెళ్లి మీ మమీకి చెప్పు అన్నాను.
తారక్ థాంక్యూ సార్ అంటూ నా పాదాలకు నమస్కరించి వెళ్లిపోయాడు.
‘‘..‘శ్రీరామ చరితం రామాయణం
సీతమ్మ హృదయం రామాయణం
రామాయణం నిత్య పారాయణం’.
అన్న పాటను టైటిల్ సాంగుగా రాసి మద్రాసు వెళ్లి మంగళంపల్లి బాలమురళీకృష్ణగారి చేతపాడించి రికార్డు చేయించాను. రామాయణపరంగా చాలా గొప్పపాట నా చేత పాడించారని బాలమురళిగారు ఆనందం వ్యక్తం చేశారు. కానీ ఆ పాటను నాకు చెప్పకుండానే చిత్రంలోనుండి తీసిపారేశాడు గుణశేఖర్. అలా ఎందుకు చేశావని నేనతన్ని అడిగాను. ఒక దర్శకుడిగా ఆ పాట అవసరం లేదని నాకనిపించింది అని బాధ్యతా రహితంగా సమాధానమిచ్చాడు. అది అతని అహంకారానికి నిదర్శనం...’’
‘‘...ఒకరోజు నేను గుణశేఖర్‌ని పిలిచి ‘రామాయణం’ చిత్రానికి అటు జాతీయ అవార్డు, ఇటు నంది అవార్డు లభించినప్పటికీ దానికి సంబంధించిన అప్పులు నన్ను నిలువునా కృంగదీస్తున్నాయి. త్వరగా మన కాంబినేషన్‌లో ఒక మంచి సోషల్ పిక్చర్ తీస్తే తప్ప నేనీ అప్పుల బాధ నుండి కోలుకోలేనని చెప్పాను. అది నా బాధ్యత సార్ అని అన్నాడతను.
వారంరోజుల తర్వాత నావద్దకు వచ్చి సార్ మన రామాయణం చిరంజీవిగారు చూసి వైజయంతీ మూవీస్‌లో తాను నటించబోతున్న చిత్రానికి దర్శకత్వం వహించమని నన్ను కోరారు. ఒక పెద్ద హీరో పిక్చర్ డైరక్ట్ చేశాక నా విలువ మరికొంత పెరుగుతుంది. తర్వాత మన పిక్చర్ చేస్తే మీకూ ఆదాయం పెరుగుతుందని చెప్పాడు.
ఐతే ఆ చిత్ర నిర్మాణం జరుగుతుండగానే మనకొక మంచి కథ తయారుచెయ్యి అన్నాను. నేనిప్పటికీ హీరో మహేష్‌ను దృష్టిలోపెట్టుకుని ఒక కానె్సప్టు మనకోసం ఆలోచించి ఉంచాను. వైజయంతీవారి చిత్రం విడుదల కాగానే కథా చర్చల్లో కూర్చుందామన్నాడు గుణశేఖర్. నేనతని మాటలు నమ్మి మహేష్‌కు, భూమికకు అడ్వాన్స్ ఇచ్చాను. గుణశేఖర్ ముందుగానే ఐదు లక్షలు అడ్వాన్స్ తీసుకున్నాడు. తర్వాత నాకోసం తయారుచేసిన కథను మహేష్ హీరోగా ఎంఎస్‌రాజుకు చేస్తున్నాడని తెలిసింది. నేను షాక్ తిన్నాను.
వైజయంతీ మూవీస్ వారి ‘చూడాలని ఉంది’ చిత్రం అఖండ విజయం సాధించడంతో చాలామంది నిర్మాతలు అతని వెంటపడ్డారు. దాంతో అతను నన్ను పూర్తిగా మరిచిపోయాడు. నేను అనేకమార్లు అతని ఇంటికి వెళ్లి నన్ను ఎలాగైనా ఆర్ధిక బాధలనుండి బైటపడేయమని బతిమాలాను. ఐనా అతను పట్టించుకోలేదు. ఒకరోజు ఎప్పుడూ ఇల్లు వదిలి బైటకు అడుగుపెట్టని నా శ్రీమతిని కూడా వెంటపెట్టుకుని అతని ఇంటికి వెళ్లాను. అతను గంటసేపటి తర్వాత తన గదినుండి బైటికి వచ్చి మీరు అనవసరంగా నా చుట్టు తిరిగి లాభంలేదు. ఇప్పుడు నా రెమ్యూనరేషన్ మీరు భరించలేరు అని తలపొగరుగా సమాధానం చెప్పినా అడ్వాన్స్ తిరిగి పంపించేశాడు.
‘‘...ఇక నా రామాయణ రాముణ్ణి గురించి చెప్తాను. ‘రామాయణం’ నిర్మాణంలో ఉండగా తాతయ్యా! మీరు నాలుగయిదేళ్లు ఓపిక పట్టండి. అప్పటికి నేను పూర్తిస్థాయి కధానాయకుడిగా ఎదుగుతాను. మొదటి పిక్చర్ మన బ్యానర్లోనే చేస్తాను. ఈలోగా మంచి టీనేజ్ లవ్ సబ్జెక్టు తయారు చేయించండన్నాడు. నేనతని మాట నమ్మాను. అతను కథానాయకుడుగా ఎదిగాక మొదటి పిక్చర్ రామోజీరావుగారి బ్యానర్లో చేస్తున్నాడని పేపర్లో చదివాను. వెంటనే రామోజీ ఫిలిం సిటీకి వెళ్లి నాకిచ్చిన మాట మర్చిపోయావా బాబూ అన్నాను. లేదు తాతయ్యా! ఈ పిక్చర్ మా డాడీ రెకమెండేషన్‌తో ఒప్పుకున్నాను. తర్వాత పిక్చర్ మనదే అన్నాడు అతి వినయం ప్రదర్శిస్తూ తారక్. కానీ తర్వాత అతను వరసగా వివిధ బ్యానర్లలో నటిస్తూనే ఉన్నాడు. నేను ఆత్మను చంపుకుని అతని చుట్టు తిరగసాగాను. ఒకరోజు అతను అయిన ఆలస్యమెలాగూ అయింది. సెంటిమెంటల్‌గా మీకు తొమ్మిదో పిక్చర్ చేయాలనుకుంటున్నాను. డైరక్టర్ ఎవర్నది తర్వాత చెప్తానన్నాడు. అతను ఎన్నిమార్లు ఆడి తప్పుతున్నా నేను మాత్రం అతనే్న దృష్టిలో వుంచుకుని మంచి కథ రూపొందించాను.
చిన్న హీరోగా నా ‘రామాయణం’లో నటించి పెద్ద హీరోగా ఎదిగిన తారక్ ఒకరోజు కథ వినేందుకు శబ్దాలయకు వచ్చాడు. చూడు బాబు! ఇప్పటికీ నా ఆఫీసు ముందు రామాయణ రాముడుగా నీ ఫోటోనే ఉంది. నీకు ఇన్నాళ్లకు నామీద దయకలిగింది అన్నాను. మీరు జరిగిపోయిన దాన్ని గురించి ఏకరవు పెట్టకుండా ముందు కథ మొదలుపెట్టండి అన్నాడతను.
నేనలాగే మొదలుపెట్టాను. అతను మాటి మాటికీ మొలక మీసం దువ్వుకుంటూ కథ వింటున్నాడు. ఇంతలో కళాబంధు డా.టి.సుబ్బరామిరెడ్డిగారు నాతో ఏదో మాట్లాడాలని శబ్దాలయకు వచ్చాడు. బాబూ! నువ్వు ఐదు నిముషాలు పక్క రూమ్‌లో కూర్చో. నేను సుబ్బరామిరెడ్డిగారితో మాట్లాడి వీలైనంత త్వరగా పంపించి వేస్తాను. తర్వాత మిగతా కథ కంటిన్యూ చేద్దామన్నాను. ఓకే...ఓకే అంటూ బైటకెళ్లాడు తారక్.
సుబ్బరామిరెడ్డిగారు వెళ్లిపోగానే నేను మేనేజర్‌ను పిలిచి తారక్‌ను రమ్మను అన్నాను. అఫ్టరాల్ సుబ్బరామిరెడ్డికోసం నన్ను బైట కూర్చోమంటాడా! నా ముందు సుబ్బరామిరెడ్డెంత? చూపిస్తాను నా తడాఖా! అంటూ విసురుగా కారెక్కి వెళ్లిపోయాడని మేనేజర్ చెప్పాడు. దాంతో అహంకారంలో తారక్ గుణశేఖర్‌కు తీసిపోడని తెలుసుకుని నాలో నేను కుమిలిపోయాను..’’
‘‘..తర్వాత మా అబ్బాయి, సౌందర్య, సురేష్, రమ్యకృష్ణ మొదలైన తారాగణంతో ‘అమ్మోరు’ చిత్రం ప్రారంభించాడు. ఆ చిత్రానికి పేరూ ఊరూ లేని రామారావు అనే కుర్రవాడ్ని డైరక్టర్‌గా పెట్టాడు. నేనా విషయం తెలుసుకుని కోడిరామకృష్ణ, రాజశేఖర్ కాంబినేషన్‌లో నువ్వు నిర్మించిన అన్ని చిత్రాలు విజయవంతమయ్యాయి. ఇప్పుడు ఒకేసారి ఇద్దరినీ మార్చవలసిన అవసరం ఏమొచ్చిందని శ్యామ్‌నడిగాను.
రాజశేఖర్ గురించి మీకు తెలియదు నాన్నా! వాడితో పిక్చర్ తీయడంకంటే అడుక్కు తినడం మేలు. ఇక కోడి రామకృష్ణను ఎందుకు మార్చానంటారా! ఇది చాలా లో బడ్జెట్ పిక్చర్. అందువలన కోడి రామకృష్ణ వంటి పెద్ద డైరక్టర్ అక్కరలేదనుకున్నాను అన్నాడు. పిక్చర్ పూర్తయ్యాక రష్ చూసి అనుకున్నట్టుగా రాలేదని భావించి శ్యామ్ తిరిగి కోడి రామకృష్ణనే ఆశ్రయించాడు...’’
‘‘..అమ్మోరు తమిళం, హిందీ డబ్బింగ్ రైట్స్ ద్వారా పెద్ద లాభం వచ్చింది. ఆ విజయ దర్పంతో మా అబ్బాయి నా చేయిదాటిపోయాడు. కొన్ని సందర్భాలలో నన్ను నిర్లక్ష్యంగా చూసి నా మనస్సు తీవ్రంగా గాయపరిచాడు. అయినా వాడిలో ప్రవహించేది నా రక్తమే కదా అని సరిపెట్టుకున్నాను..’’
‘‘...అమ్మోరు తర్వాత ఎవరితో పిక్చర్ తీయాలి? కథ ఎలా ఉండాలి? అన్న మీమాంసతో సుమారు రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకుని హీరో వెంకటేష్‌ను దృష్టిలో పెట్టుకుని ఒక కథ తయారుచేశాడు. హీరో పాత్ర గెటప్ ఎలా ఉండాలో నిర్ణయించడం కోసం వెంకటేష్‌కు మేకప్ వేయించి రకరకాల స్టిల్స్ తీయించాడు.
అందులో తనకు, వెంకటేష్‌కు బాగా నచ్చిన ఫోటో ఎన్‌లార్జ్ చేయించాడు శ్యామ్. వెంకటేష్ ఆ ఫోటో తీసుకుని నా వద్దకు వచ్చి అంకుల్ ఇన్నాళ్లకు శ్యామ్, నేను కలిశాం. నా గెటప్ ఇలా ఉంటుంది. మా ఇద్దరి కలయికతో సాధించే విజయం మీరే చూద్దురుగాని అని చెప్పి ఆనందంగా వెళ్లిపోయాడు.
శ్యామ్, వెంకటేష్ హీరోగా పిక్చర్ తీయబోతున్నాడన్న వార్త చిరంజీవికి తెలిసింది. అప్పట్లో వరస అపజయాలతో తల్లడిల్లిపోతున్న చిరంజీవి వెంటనే అల్లు అరవింద్‌ను శ్యామ్ దగ్గరకు పంపి ఇంటికి పిలిపించుకుని చెవిలో ఏం ఊదాడో తెలియదు కానీ వెంకటేష్‌కు బదులుగా చిరంజీవితో పిక్చర్ తీయడానికి సిద్ధపడ్డాడు. ఆ మార్పు తనకు జరిగిన అవమానంగా వెంకటేష్ భావించడంలో తప్పులేదు. మా అబ్బాయి అలా చేయడం మంచిది కాదని నేనూ బాధపడ్డాను.
అంజి చిత్రం మా ఆస్తులన్నింటినీ హరించడంతోపాటు కొనుగోలుదారులను కూడా గూబ అదరగొట్టింది. ఈ విషయంలో నేను చిరంజీవిని తప్పుపట్టను. అతను ఆర్ధికంగానూ, హార్థికంగానూ మా అబ్బాయికి అనేక విధాలుగా సహాయపడ్డాడు. కానీ చిత్రం పరాజయం పాలైతే శ్యామ్‌ను అన్ని విధాలా ఆదుకుంటానని చెప్పిన మాట మాత్రం నిలుపుకోలేదు. ఐనా మా అబ్బాయికీ, చిరంజీవికీ కల అనుబంధం అలా కొనసాగుతునే ఉంది.
శ్యామ్ అప్పటి వరకు తీసిన అన్ని చిత్రాలలోనూ టైటిల్స్‌లో ‘ఎమ్‌ఎస్‌రెడ్డి సమర్పించు’ అని వేసేవాడు. ఆ ఆనవాయితీ ‘అంజి’లో పాటించకపోగా స్వర్గీయ విజయభాస్కర్‌రెడ్డి గారి ఫోటో వేసి చిత్రం ఆయనకు అంకితమిచ్చాడు. విజయభాస్కర్‌రెడ్డిగారు వాడికి పిల్లనిచ్చిన మామైతే నాకు వియ్యంకుడు గదా అని సరిపెట్టుకున్నాను.

Friday, June 10, 2011

గళం వారి బలం


దూరదర్శన్ కేంద్రంలో ఎనౌన్సర్ ఉద్యోగానికి వెళ్లిన అతన్ని నీ వాయిస్ పనికిరాదని పంపించేశారు. తర్వాత అదే వాయిస్ కారణంగా అతను బాలీవుడ్ సూపర్ స్టార్ అయ్యాడు. తన గంభీరమైన గళంతో హిందీ చిత్ర రంగాన్ని ఓ కుదుపు కుదిపేసిన అతనే మరెవరో కాదు బిగ్‌బి అమితాబ్ బచ్చన్. దీవార్, కాలియా, అకేలా..అగ్నిపథ్ తదితర సినిమాల్లో అమితాబ్ డైలాగ్స్‌కి ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు. కేవలం అతడి డైలాగ్స్ వల్లనే అనేక చిత్రాలు హిట్ అయ్యాయి కూడా!
ముఖ్యంగా ‘దీవార్’ డైలాగ్స్ వాయిస్ గంభీరంగా ఉండడం మాత్రమే కాదు సన్నివేశానికి, భావానికి అనుకూలంగా టైమింగ్‌తో చెప్పాలి. అందులో అమితాబ్ సిద్ధహస్తుడు. ఈరోజుకీ కాలర్‌ట్యూన్స్‌గా ఈ డైలాగులు మనకి వినిపిస్తుండడం ఇందులో గొప్పతనం. గళ సంద్ర కెరటాలనుండి ఉవ్వెత్తున ఎగసిన హీరో అమితాబ్.
ఇక మన తెలుగు చిత్రసీమ విషయానికి వస్తే సంభాషణలు పలకడానికి చరిత్ర ఏర్పడింది నాటి ఎస్.వి రంగారావునుండి నేటి ప్రకాశ్‌రాజ్ వరకూ. ఎస్.వి రంగారావు మాటలు వింటేనే సెట్‌లో ఉండేవాళ్లు అదిరిపడేవారు. ఎంతటి డైలాగ్‌నైనా అవలీలగా చెప్పడం ఆయన ప్రతిభకు తార్కాణం. గంభీరమైన వాయిస్‌తో మనిషి కూడా ఎంతో హుందాగా ఉండేవారు. రఫ్‌గా, కేర్‌లెస్‌గా అరవీరభయంకరులు ఎదురుగా నిలిచినా చెక్కుచెదరకుండా తొణక్కుండా ‘పోరా గూట్లే’ అని చెప్పడం అతనికే చెల్లింది. సినిమాలో ఎస్‌వి ఉన్నారంటే సంభాషణా రచయితలు హాట్ హాట్‌గా డైలాగులు రాసేవారు. ఎస్‌వి పలికిన డైలాగుల కారణంగా ఎందరో సినీ రచయితలకి పేరొచ్చింది. ఆతర్వాత అనేక చిత్రాలకి వాళ్లు సంభాషణల రచయితలుగా కొనసాగారు. ఎస్‌వితో పోటీగా ఎంతో వేగంగా డైలాగులు చెప్పడానికి తోటి నటీనటులు తొందరపడేవారు. భయపడేవారు. ‘హే...బానిసలు...బానిసలకి ఇంత అహంకారమా’ పాండవ వనవాసం చిత్రంలోని దుర్యోధనుడిగా ఎస్‌వి పలికిన ఈ డైలాగ్ హైలెట్. ఆయన గంభీరమైన గళానికి అనుకూలమైన పాత్రలే అతనికి ఇచ్చేవారు. దుర్యోధనుడిగా, ఘటోత్కచుడిగా, రౌడీలకి రౌడీగా, కత్తుల రత్తయ్యగా, పోలీసు అధికారిగా ఎస్‌వి దారే వేరు. శకుని పాత్రలకు సరిగ్గా సరిపోయే ధూళిపాళ హావభావాలకి అనుగుణంగా పదాలు పైకి లేపుతూ తగ్గిస్తూ డైలాగ్స్ చెప్పడం ఎందరినో ఆకట్టుకుంటుంది.
సిఎస్‌ఆర్ ఆంజనేయులు కూడా ఓ చిత్రమైన మేనరిజంతో సంభాషణలు పలికేవారు. అమాయకరాజు పాత్రలో సిఎస్‌ఆర్ చెప్పే డైలాగులకు హాలులో చప్పట్లుపడేవి. చాలా సులువుగా భాషలో స్పష్టత కోల్పోకుండా పదాలు పలకడం సిఎస్‌ఆర్ గొప్పతనం. తర్వాత తప్పకుండా చెప్పుకోవాల్సింది రక్తకన్నీరు నాగభూషణం గురించి. ఫలానా సినిమాలో నాగభూషణం ఉన్నాడంటే ఆసక్తికర వ్యంగ్య సంభాషణలు ఉంటాయని ప్రేక్షకులు ఎగబడేవారు. తమిళహీరో ఎం.ఆర్.రాధాకి తెలుగులో నాగభూషణం డబ్బింగ్ చెప్పేవారు. కేవలం తన ప్రత్యేక సంభాషణలు పలకడం ద్వారానే నాగభూషణం ప్రతినాయక పాత్రలో చక్కగా రాణించారు. ఎస్.వి.రంగారావుతో ఆ రోజుల్లో పోటీపడి డైలాగులు చెప్పడం ఇతనికే చెల్లింది.
రేడియో శ్రోతలని తన కంచుకంఠంతో ఆకట్టుకునే కొంగర జగ్గయ్య సినీ రంగానికి అరంగేట్రం చేసి డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. సన్నివేశానికి అనుగుణంగా వాయిస్ మార్చడంలో జగ్గయ్య ప్రత్యేకత. అల్లూరి సీతారామరాజు సినిమాలో రూథర్‌ఫర్డ్ పాత్ర అంత గొప్పగా పండిందంటే అందుకు జగ్గయ్య ఇంగ్లీషు దొర మాదిరిగా పలికిన సంభాషణలే కారణం. అప్పట్లో చాలా మంది ఆశ్చర్యపోయారు. స్వతహాగా జగ్గయ్య భాషావేత్త, సాహితీవేత్త కావడంవలన ఏ భాషలోనైనా అవలీలగా డైలాగులు చక్కగా చెప్పేవారు. సినీ రంగానికి చెందిన వారే కాదు ఇతరత్ర రంగాలల్లోని మేధావులు కూడా జగ్గయ్య గళాన్ని అభినందించారు. దటీజ్ కొంగర జగ్గయ్య. చివరికి ఆయన చనిపోయినప్పుడు ఓ పత్రిక పతాక శీర్షికలో ఫ్రంట్ పేజీలో ‘మూగబోయిన కంచుకంఠం’ అంటూ రాసింది. ఆయన గళంలో గంభీరం, ఆప్యాయత, ప్రేమ ఉండేవి. ముఖ్యంగా ఏదో ఆర్ధత ఉండేది. భాషమీద మాత్రమే కాదు...ఏ డైలాగ్ ఎలా చెప్పాలి అనేదానిపై జగ్గయ్య పరిశోధన చేశారు.
ముత్యాలముగ్గు సినిమా అనగానే అందరికీ రావుగోపాలరావు డైలాగులు గుర్తుకు వస్తాయి. ప్రతిభావంతంగా వ్యంగ్య సంభాషణలు పలికి చిత్ర విజయానికి ‘రావు’ కారణమయ్యారు. ఈ సినిమా డైలాగ్స్ కేసెట్లు విపరీతంగా అమ్ముడుపోయాయి. ‘ఊరికే తిని తొంగుంటే మనిషికీ గొడ్డుకీ తేడా ఏముంది..మనిషన్నాక కాస్తంత కళాపోషణ ఉండాలి’. ఈ రోజుకీ మన తెలుగు సంస్కృతిలో నాడు ముత్యాలముగ్గు సినిమాలో రావుగోపాలరావు చెప్పిన డైలాగ్ గుర్తుండిపోయింది.
ఆ తర్వాత మోహన్‌బాబు, శ్రీహరిలు కూడా ఇదే బాటలో నడిచారు. నటప్రపూర్ణ మోహన్‌బాబు కూడా అమితాబ్ మాదిరిగా తన గళమే అవకాశాలు తీసుకువచ్చింది. హీరోగా పేరు ప్రతిష్టలు వచ్చేలా చేసింది. సింపుల్‌గా, సీరియస్‌గా కత్తితో నరికినట్టు డైలాగులు చెప్పడం మోహన్‌బాబుకే సాధ్యం. ‘ఖైదీగారు’ చిత్రంలో ఓ డైలాగ్ ఉంది ‘ఇద్దరు కలిస్తే పుట్టాం...నలుగరు మోస్తే పోతాం’ భలేగా ఉంటుంది పలికే విధానం. పెదరాయుడు, అసెంబ్లీరౌడీ, ఎమ్.్ధర్మరాజు ఎంఎ, పుణ్యభూమి నాదేశం, కలెక్టరుగారు తదితర చిత్రాలు నటప్రపూర్ణ గళంలోని ప్రతిభకు అద్దం పట్టాయి.
ఆ మధ్య మాటల రచయిత ఓంకార్ కూడా అనేక చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు ధరించి..వ్యంగ్యంగా డైలాగ్స్ పలికాడు. కొంతవరకు సంభాషణల సాగరం రావుగోపాలరావును మరిపించాడు. డబ్బింగ్ కళాకారులకి స్టార్‌డమ్ ఇలాంటి వారివలనే వచ్చింది.
ఇలా డబ్బింగ్‌ను నమ్ముకుని తమ గళంపై నమ్మకంతో చిత్రరంగానికి వచ్చింది పి.జె శర్మ కుటుంబం. సినీ డబ్బింగ్‌కి తమ కుటుంబాన్ని అంకితం చేశారు. అందులోనుండి వచ్చిన ప్రళయమే డైలాగ్‌కింగ్ సాయికుమార్. ‘అంకుశం’ సినిమా హిట్ కావడానికి సాయి గళం ప్రధాన కారణం. రాజశేఖర్, సుమన్, మమ్ముట్టి, సురేష్‌గోపిలతో పాటు అనేక భాషల హీరోలకి సాయి కుమార్ తన గళాన్ని అందించారు. ఇక్కడ కూడా గణమే సాయికుమార్‌ని హీరోని చేసింది. ‘పోలీస్‌స్టోరీ’ లాంటి పెద్ద హిట్‌ని అతని ఖాతాలో జమచేసింది. ఈ చిత్రంలో డైలాగ్స్ బాగుండడమేకాదు సాయి పలికేవిధానం కూడా సూపర్‌గా ఉంటుంది. గుక్క తిప్పుకోకుండా సాయికుమార్ అరగంటపాటు డైలాగ్ చెప్పడం గ్రేట్.
రావుగోపాలరావు లాంటి నటుడి కొడుకుగా ఉండి కూడా అష్టకష్టాలు పడి చిత్రసీమలో చేరి కేవలం తన గళం కారణంగానే స్థిరపడిన ప్రత్యేక నటుడు రావు రమేష్. క్రిష్ డైరక్షన్‌లో వచ్చిన ‘గమ్యం’ సినిమాకి రావు రమేష్ డైలాగ్ డెలివరీ బలాన్ని చేకూర్చింది. నటుడిగా అతని కెరీర్‌ని పూర్తిగా నిలబెట్టింది. తర్వాత చెప్పుకోవాల్సింది ప్రకాష్‌రాజ్ గురించి. భాష రాకపోయినా సరే తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకునే దమ్మున్న నటుడు. మనసిచ్చి చూడు, సుస్వాగతం, అమ్మాయికోసం, అజాద్ చిత్రాల్లో ప్రకాష్‌రాజ్ చిత్ర విచిత్ర గళశక్తి మనకి తెలుస్తుంది. తమ గళాన్ని హీరోగా చేసిన వీరందరి జీవితాలు ధన్యం!