Sunday, October 16, 2011

మనసు పాటల ఆత్రేయ

ఆత్రేయ పేరు చెప్పగానే అందరికీ గుర్తువచ్చేది ఆయన మనసు పాటలు. ఆ తర్వాత వలపు పాటలు, వానపాటలు వగైరా..కానీ ఆత్రేయకు వీణపాటలంటే ప్రత్యేకమైన అభిమానమనీ, ఆయన హృదయాలను ద్రవింపచేసే విశిష్టమైన వీణపాటల్ని రాశారనీ చాలామందికి తెలియదు. ఆ మాటకొస్తే తెలుగు సినిమాల్లో ఎక్కువ వీణ పాటల్ని ఆలపించిన మధుర గాయని పి.సుశీల అయితే ఎక్కువ వీణపాటల్ని రాసిన కవి ఆచార్య ఆత్రేయే! లభిస్తున్న ఆధారాల మేరకు ఆత్రేయకు ఏడుసినిమాల్లో తొమ్మిది వీణపాటల్ని రాసే అవకాశాలు లభించాయి. (ఈ అంకెను నా ‘తెలుగు సినీ కవుల చరిత్ర’పుస్తకంలో ఆరుగా పేర్కొనడం పొరపాటు!). వీటిలో ఎనిమిదింటిని వీణావాణి అయిన పి.సుశీల ఆలపించగా ‘మురళీకృష్ణ’ చిత్రంలో పాటను మాత్రం జానకి పాడారు. ఈ వీణపాటల్లో ఆత్రేయ ఎంతటి వైవిధ్యాన్ని కనబరిచారో, ఆయన వీణపాటల నేపథ్యం ఏమిటో తెలుసుకుందాం.
వీణను ప్రధాన వస్తువుగా తీసుకుని రాసిన పాటలు, వీణ ప్రధాన వాద్యంగా చిత్రీకరించిన పాటలు రెండూ తెలుగులో వీణపాటలుగానే పరిగణింపబడ్డాయి. ‘అర్ధాంగి’ చిత్రంలో ఆత్రేయ రాసిన
వద్దురా కన్నయ్య ఈ పొద్దు/ఇల్లు వదలిపోవద్దురా అయ్య/ పశువులింటికి పరుగులెత్తే వేళ/ పసిపాపలను బూచి పట్టుకెళ్లే వేళ..
అనే గొప్ప పాటలో వీణ ప్రసక్తి ఎక్కడా లేదు. అది వీణకోసం రాసింది కూడా కాదు. కాని దర్శకుడు తన అభిరుచిమేరకు ఆ పాటను వీణమీదే చిత్రీకరించాడు. ఇదికాక ఆద్యంతం వీణమీద లేదా ఆ వాదనానికి తగిన గానం మీద ఆత్రేయ మరి తొమ్మిదిపాటల్ని రాశారు. తెలుగు సినిమాల్లో వీణమీద చిత్రీకరించిన పాటలన్నీ ఇలా ఉద్దేశించి రాసినవి కావు!
ఆత్రేయ రెండేసి వీణపాటలు రాసిన చిత్రాల్లో మొదటిది ‘డా.చక్రవర్తి’ (1964). ఈ రెండు పాటల్లో తెరమీద ఒకటి కథానాయకుని చెల్లెలు (గీతాంజలి), రెండోది కథానాయిక (సావిత్రి) వీణ వాయిస్తూ పాడినట్టు చిత్రీకరించారు. వీటిలో మొదటిదానిలో వీణ ప్రసక్తి ఉంది. రెండోదానిలోలేదు. ముఖ్యంగా ఈ రెండూ గాన ప్రధానమైనవి. స్థూలంగా చూస్తే రెండుపాటల్లో భావ సారూప్యం కనిపించినా సూక్ష్మంగా పరిశీలిస్తే మొదటిపాటలో వినమ్రతతో కూడిన నివేదనం రెండోపాటలో తన ప్రణయగీతి కృష్ణుడికి మాత్రమే వినిపించాలనే ఆరాధనా భావం స్పష్టంగా కనిపిస్తాయి.
1. పాడమని నన్నడగవలెనా/ పరవశించి పాడనా/ నేనే పరవశించి పాడనా
2. పాడమని నన్నడగతగునా/ పదుగురెదుటా పాడనా/ కృష్ణా పదుగురెదుటా పాడనా
ఈ రెండు పల్లవులకు బసవరాజు అప్పారావుగీతం- పదిమందిలో పాట పాడుమని/బలవంతము చేయకు నాధా మూలమైనా ఆత్రేయ శైలి, శిల్పం-మూలాన్ని మరిపించాయి.
ఆత్రేయ ‘చక్రవాకం’ (1974) చిత్రంలో రాసిన వీణపాటలు బొమ్మ-బొరుసు తరహాకి చెందినవి.
1. వీణలోనా తీగలోనా/ ఎక్కడున్నది నాదము
అది ఎలాగైనది రాగము
2. వీణలోనా తీగలోనా/ ఎక్కడున్నది అపశ్రుతి-అది/ ఎలాగైనది విషాద గీతి -మొదటిది సంతోష సమయానికి, రెండోది విషాద సందర్భానికి రాసినవి. ఇలాంటి జమిలి పాటలు రాయడం ఆత్రేయకు కొట్టిన పిండి. రెండింటిలోనూ శ్రుతిరాగ గానాలను అన్వయించిన తీరు ఆత్రేయ సంగీత పరిజ్ఞానాన్ని తెలియజేస్తుంది. ‘మురళీకృష్ణ’ (1964) చిత్రంలో పెళ్లి పీటలపైనే సౌభాగ్యాన్ని కోల్పోయిన విధివంచిత అయిన యువతి పాత్ర (గీతాంజలి) ఆలపించిన
మోగునా ఈ వీణ, మూగవోయిన/ రాగహీన, అనురాగ హీన అనేపాటకు- ‘గోరింటాకు’ (1979) చిత్రంలో రెండవనాయిక (స్వప్న) పాత్ర పరిచయంలోనే వినిపించిన
పాడితే శిలలైనా కరగాలి/ జీవిత గతులైనా మారాలి/ నా పాటకు ఆ బలమున్నదో లేదో/ పాడిన పిదపే తెలియలా
పాటకు చాలా పోలికలున్నాయి. రెండో పాటలోని- తాళి కట్టెడి వేళకోసమై/ లేచి చూచినది విరిమాల/ కట్టే వేళకు కట్టని తాళిని/ కత్తిరించినది విధిలీల -అనే చరణం ఈ పాత్రలకున్న సాదృశ్యాన్ని స్పష్టం చేస్తుంది. ‘గోరింటాకు’ నిర్మాత మురారి తన చిత్రంలోని పాటకు ‘దేశోద్ధారకులు’ చిత్రంలో ఆత్రేయ రాసిన వీణపాట స్ఫూర్తి అంటారు. కానీ-అది జ్ఞాపక లోపం. ఈ పాటకు, పాత్రకు ‘మురళీకృష్ణ’యే మూలం!
‘దేశోద్ధారకులు’ (1973) చిత్రంలోని
ఈ వీణకు శృతిలేదు
ఎందరికో హృదయం లేదు
నా పాటకు పల్లవి లేదు
బతుకెందుకో అర్ధం కాదు
అనే పాట ఓ వేశ్య ప్రశ్నించే గుండెల్ని పిండే ఆర్తగీతం
ఆత్రేయ వీణపాటల్లో ఎక్కువ ప్రాచుర్యాన్ని పొందింది ప్రేమ్‌నగర్’ (1971)లోని
ఎవరో రావాలి, నీ హృదయం కదిలించాలి
నీ తీగలు సవరించాలి, నీలో రాగం పలికించాలి
అనే ఉద్వేగభరితమైన పాట. మూలపడిన మధురవీణ లాంటి కథానాయకుని ఆంతర్యం స్ఫురించేలా అద్భుతంగా రాసిన ఈ పాట నాయిక లత (వాణిశ్రీ) మీద చిత్రీకరించబడింది. ఆత్రేయ మనసు పొరల్లోంచి వచ్చిన ఈ పాటకు మామ బాణీ సుశీల గానం, వాద్య సహకారం ప్రాణం పోశాయి. కనె్న మనసులో పరవళ్లు తొక్కే పారవశ్యానికి అక్షరాకృతి నిచ్చింది ‘అత్తలూ-కోడళ్లు’ (1971) చిత్రంలోని ఆత్రేయ వీణపాట. ఈ వీణ పలికించు ఎన్ని రాగాలో/ నాలోన పులకించు ఎన్ని భావాలో అనే ఈ పాటలో మోహన, కల్యాణి మొదలైన రాగాలను పేర్కొంటూ వలపుకూ సంగీతానికి అందంగా ముడివేశారు ఆత్రేయ. ఈ పాట, డా.చక్రవర్తిలోని ఆత్రేయ వీణ పాటలు పెళ్లి చూపుల్లో వధువు పాట పాడి వినిపించే కాలంలో తరచుగా వినిపించేవి.
వీణ కర్నాటక సంగీతానికి ప్రధానమైన, హృద్యమైన వాద్యం. కనువిందైన నాయిక వీణముందు కూర్చుని వీనుల విందుగా పాట పాడుతుంటే-ఆ మనోహరమైన దృశ్యం వీక్షకులనలరిస్తుందని ఆనాటి సినీ దర్శకులు తమ చిత్రాల్లో వీణపాటలకు స్థానం కల్పించేవారు. సాధారణంగా నాయిక మధురోహలలోనో, ప్రణయ స్మృతులలోనో తెలియాడే సన్నివేశానికి వీణపాటను రూపొందించేవారు. కానీ ఆత్రేయ వీణపాటల్లో అధిక శాతం ఆవేదనా భరితాలు కావడం, అవి ప్రేక్షకామోదాన్ని పొందడం గమనార్హం.
ఆత్రేయ వీణపాటలు బాణీ వెనక ఓ కథ ఉంది. దానిని ఆయన ఆత్మకథలో ‘తొలిగాయం’గా పద్యరూపంలో రాశారు. ఆయన ప్రియురాలు ‘బాణం’ వీణావాదనంలో నేర్పరి. కారణాంతరాలవల్ల ఆమెకు ఆత్రేయతో వివాహం కాలేదు. వివాహానంతరం ఆమె ఆయనకు తారసపడినప్పుడు -‘నీతో పెళ్లి జరగలేదు కనుక వీణను అటకెక్కించాను’ అందట! అప్పటినుంచి వీణ ప్రసక్తి వస్తే ఆత్రేయ పగిలిన హృదయంనుంచి ప్రకంపనలు వినిపించేవి! అవే ఆయన వీణపాటలయ్యాయి!
వెండితెర మీద వీణపాటలు కనుమరుగై చాలాకాలమయినా, ఇప్పటికీ ఆత్రేయ వీణపాటలు వినిపిస్తుండడం వాటి విశిష్టత!

Sunday, October 2, 2011

సినిమా పోస్టర్

ముక్కలు చేసింది తిరిగి అతికితే ఎంతయినా కృతకంగానే వుంటుంది. కానీ అదేం చిత్రమో.. ముక్కలు ఎన్ని ఎక్కువైతే అంతకు అంతా అందంగా తయారవుతుంది....సినిమా పోస్టర్.. చెప్పే విషయం ఏదైనా చదివించేదిగా వుండాలంటే, అక్షరాలు అందంగా అమరాలి.. విడివిడి అక్షరాలు కలివిడిగా మారితేనే అందమైన కావ్యం అవతరిస్తుంది. 24ముక్కలు కలిసి కమనీయ పోస్టర్‌గా మార్చిన వాడికి, వేన వేల అక్షరాలు కూర్చి జీవిత కావ్యం అందించడం అసాధ్యమా..కానే కాదు. అందుకే చిత్రకారుడు ఈశ్వర్ జీవితకథ..సినిమా పోస్టర్ అందంగా..అంతకన్నా ఠీవిగా జంక్షన్‌లో జయకేతనం ఎగురేసింది. 3గీతా2చార్యుల్లో, రాతనేర్చిన వారు అరుదు. రమణ చాటు నేస్తం బాపుసంగతి అంతగా తెలియదు కానీ, మోహన్, చంద్ర భలేగా రాయగలరు. భావాలను కుంచెతోనే కాదు..కలంతో కూడా చెప్పేయగలరు. ఇప్పుడు చిత్రకారుడు ఈశ్వర్ సొంత కథ చదివాక ఈ జాబితాకు మరో పేరు జోడయిందనిపిస్తుంది. ఈశ్వర్‌కు పబ్లిసిటీ ఆర్టిస్టు అనో, సినిమా డిజైనర్ అనో, పోస్టర్ డిజైనర్ అనో విశేషణం జోడిస్తే, కచ్చితంగా ఆయన్ను తక్కువ చేసినట్లే అవుతుంది. తెలుగుసినిమా ప్రగతిలో ఆయన వాటా ఆయనకు వుంది. ఆ రంగ చరిత్రలో ఆయన పేజీ ఆయన డిజైన్ చేసుకున్నదే. ఎన్ని సినిమాలు..ఎంత మంది హీరోలు..ఎన్ని పాత్రలు..ఎన్ని ఆహార్యాలు..ఎన్ని వైవిధ్యమైన డిజైన్లు. రచయిత ఊహలో దాగుడుమూతలాడుతున్న పాత్రలను తన ఊహతో ఒడిసిపట్టి, కుంచెలోకి కుదించి, కాగితంపైకి మళ్లించి, జనం కళ్ల ముందుంచడంలో తొలి కష్టం ఈశ్వర్‌దే. కంప్యూటర్ కాలం కాదది. ప్రతీదీ స్వంత కష్టంపైనే ఆధారపడి చేయాల్సింది. అలాంటి రోజుల్లో ఈశ్వర్ చేసిన 3సిత్రాలు2 ఇన్నీ అన్నీనా? మాస్ జనాలని థియేటర్ దిశగా మళ్లించే సినిమా పోస్టర్‌కు క్లాసిక్ హంగులు అద్దారా.. సినిమాకో వేషం వేసే హీరోలకు అన్ని రకాల వేషాలూ అమరేలా విగ్గులు డిజైన్ చేసారా... సింగిల్ కట్ నుంచి 24షీట్ వరకు ఎన్ని ప్రయోగాలు చేయాలో అన్నీ చేసేసారా?... సింగిల్ హ్యాండ్‌తో ఎన్ని జూనియర్ హ్యాండ్‌లను తయారుచేసి, సినిమా రంగానికి కానుకగా ఇచ్చారనీ..? ఇన్ని చేసిన 3ఈశ్వరుడి2కి ఈ రంగమే కాదు..జగమంతా తెలుసుని ఇప్పుడు జనానికి తెలిసింది..ఈ సినిమా పోస్టర్ పుస్తకంతో. సినిమా ఆర్టిస్టు ఈశ్వర్ జీవితకథ. పుట్టిందీ..పెరిగిందీ..సినిమారంగంలో నిలదొక్కుకున్న వైనం..ఇవేగా వుండేది. అచ్చంగా అంతే వుంటే..ఇంతలా చెప్పుకోనక్కర్లేదు. పేజీలు తిరగేసి, ఫొటోలు చూసేసి, పక్కన పెట్టేసుకోవచ్చు. కానీ ఈశ్వర్ డిజైన్ చేసిన సినిమా పోస్టర్‌లాగే ఈ పుస్తకం కూడా మనల్ని అంత సులువుగా కళ్లు తిప్పుకోనివ్వదు. పైగా ఏకబిగిన మొత్తం చదివేయమంటుంది. అలా అని గబగబా చదివేద్దామంటే వీలు కాదు. ఎందుకంటే దాన్నిండా విషయం కిక్కిరిసిపోయింది. ఇటు మన సినిమా డిజైనింగ్ రంగంలోనే కాదు, దేశీయంగా, అంతర్జాతీయంగా ఈ విభాగంలో వినుతికెక్కినవారి వైనాలన్నీ విడమర్చి వివరించారు. అక్కడితో ఆగిపోయారా...మన 3గీతా2చార్యుల్లో కాస్త చేయితిరిగిన వారి గురించి విన్నవించుకున్నారు. ఇది తన కథ కాదు..తను దర్శించిన చిత్రప్రపంచం అని సవినయంగా కళ్లముందుకు తీసుకొచ్చారు.. వినయంగా అని ఎందుకనాల్సి వచ్చిందంటే, ఇంత మంచి విషయాలు అన్నీ ఓపిగ్గా సేకరించి, గుదిగుచ్చి అందించిన తరువాత కూడా 3తిలకాష్ట మహిషబంధనం2లా..ఓ అద్భుతమైన, గాంభీర్యమైన పేరు పెట్టకుండా, తను నముకున్న, తనను ఇంతవాణ్ణి చేసిన సినిమా పోస్టర్‌నే మకుటంగా వుంచారు ఈశ్వర్. పుస్తకంలో పలు ప్రధానాంశాలున్నాయి. ఒకటి ఈశ్వర్ అనే ఈశ్వరరావు పుట్టింది..పెరిగింది..ఎలా చెన్నపట్నం చేరిందీ. చెన్నపట్నంలో సినిమా రంగంలో కాలూనిన దగ్గర నుంచి నడిచిన తోవలో ఎదురైన అనుభవాలు..ఆపై, మన సినిమా ప్రచార రంగం, దాని ప్రగతి పయనం, వివిధ రకాల ప్రక్రియలూ,(ముఖ్యంగా పేజీ 85 నుంచి), కాలంతో పయనించిన వివిధ ప్రకటన సంస్థలు, వాటి వైనాలూ ఇవన్నీ ఒక ఎత్తు. ప్రపంచ ప్రఖ్యాత వర్ణ చిత్రాలూ, కళాకారులూ, బాలీవుడ్ ప్రచార కళాకారులూ, వారి సంక్షిప్త పరిచయాలూ, ఇవి చాలవన్నట్లు మన తెలుగు చిత్రకారులూ, వారి విఖ్యాత విలాసం జోడించారు మళ్లీ వెనక్కివచ్చి తెలుగు తమిళ సినీ ప్రముఖులూ, సంస్థలూ, స్టూడియోలూ, పలువురు పోస్టర్ డిజైనర్లూ ఇలా ఎందరెందరినో, ఆఖరికి తన దగ్గర పనిచేసిన ప్రతి ఒక్కరితో సహా.. స్మరించుకున్నారు..తలుచుకుని మురిసిపోయారు. ఇక ఇవన్నీ చాలవన్నట్లు, తన సుదీర్ఘ వృత్తి జీవితంలో తన కుంచె నుంచి వెలువడిన ఎన్నో చిత్రాలను ఆల్బమ్‌లా గుదిగుచ్చి అందించారు. పుస్తకం చదవుకుండా పొరపాటున ఈ బొమ్మల జోలికి వెళ్లారో..అలా అలా వాటి వెంట వెళ్లిపోయే ప్రమాదం వుంది. వాటిని చూడాలనే ఆతృతను అలాగే అదిమిపెట్టి, అక్షరాల వెంట పరుగులు పెట్టి, ఆ తరువాత ఈ వర్ణచిత్ర సౌరభాన్ని తనివితీరా ఆస్వాదిస్తే, ఆ అలసట మటుమాయమవుతుంది. పఠన ప్రయాణం పరిపూర్ణమవుతుంది. అంతా పూర్తయ్యాక, అప్పుడనిపస్తుంది. ఇంతకీ ఈశ్వర్ 3గీతాచార్యుడా.. ..రాతకారుడా? తన బొమ్మలంత అందంగానూ, పుస్తకం రాసేసాడే అని. అదే సమయంలో చేయి తిరిగిన స్క్రిప్ట్ రైటర్‌లా రాయదల్చుకున్నవి, చెప్పదల్చుకున్నవి ఒక పద్దతి ప్రకారం చెప్పాడే అని. కొసమెరుపేమిటంటే..అప్పుడప్పుడు పుస్తకంలోకి కైలాసం అనే పాత్రధారి వచ్చి ఈశ్వర్ మనసులోని మాటలు చటుక్కున చెప్పేసి, వేయాల్సిన చెణుకులు వేసేసి వెళ్లిపోతుంటాడు. భలే చమత్కారంగా. ఏదైనా చూడాల్సినదే కాదు..చదవాల్సింది కూడా సినిమా పోస్టర్?2 సినిమా పోస్టర్ రచన: ఈశ్వర్ వెల: రూ.450/- విజయా పబ్లికేషన్స్ 15, పలయకరన్ స్ట్రీట్ కలైమానగర్, చెన్నయ్-32 ఫోన్: 9848046535