Sunday, April 28, 2013

గురు రాఘవేంద్ర బృందావనం మంత్రాలయం ఫోటోలు


బృందావన గోపురం


మాంచాలమ్మ వారి సన్నిధి


గజ వాహన సేవ



బంగారు వాహన సేవ

ఆలయానికి వెళ్ళే దారి



ఊయల సేవ




Thursday, April 11, 2013

మధుర గాయకుడు ఏ.ఎం.రాజా

మల్లీశ్వరి, పాతాళ భైరవి, దేవదాసు చిత్రాల విజయంతో సంగీత పరంగా ఘంటసాల గానమాధుర్యంలో ఆంధ్ర దేశమంతా పరవశిస్తున్న కాలంలో చల్లని మలయ పవనంలా సినీ సంగీత ప్రపంచంలో ప్రవేశించి, స్వరమాధుర్యంతో తనదంటూ ఒక ప్రత్యేకశైలిని శ్రోతల హృదయాల్లో ప్రతిష్టింపచేసిన మధుర గాయకుడు ఎ.ఎం.రాజా (అనిమేల మన్మధరాజ).
1954లో విడుదలయిన మూడు చిత్రాలు ‘ప్రేమలేఖలు’, ‘అమర సందేశం’, ‘విప్రనారాయణ’పై అంశాన్ని రుజువుచేశాయని చెప్పవచ్చు.
షోమాన్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్ రాజ్‌కపూర్ హిందీలో నిర్మించిన ‘‘ఆహ్’’ తెలుగు వర్షన్ ‘‘ప్రేమలేఖలు’’. ఈ చిత్రంలో ‘‘నీవెవ్వరవో చిరునవ్వులలో’’ ‘‘విధి రాకాసి కత్తులు దూసి’’ గీతాలు రాజ్‌కపూర్ స్వయంగా ఆలపించిన అనుభూతిని ప్రేక్షకులకు కలిగించారు రాజా. ఈ చిత్ర విజయానికి ఆయన స్వరం ఓ వరంగా మారింది. సంగీత ప్రధాన చిత్రం ‘‘అమర సందేశం’’లో ‘‘ఆనతి కావలెనా’’, ‘‘దయామయి శారద’’, పోటీ పాట ‘‘మానసలాలస సంగీతం’’రసజ్ఞుల ప్రశంసలు అందుకున్నాయి. ఇక విప్రనారాయణ చిత్రానికి కారణాలేవయినా కాని ఘంటసాల వారిని కాదని ఎ.ఎం.రాజాకు అవకాశమిచ్చారు భానుమతి, రామకృష్ణలు. ఈ చిత్రంలో ఒక భక్తుని హృదయావిష్కరణను ‘‘పాలింపరా రంగా’’, ‘‘చూడుమదే చెలియా’’ గీతాల్లోనూ, అన్యోన్య అనురాగాన్ని ‘‘మధుర మధురమీ చల్లనిరేయి’’, విరహాన్ని ‘‘అనురాగాలు దూరములాయేనా’’ అంటూ అక్కినేని స్వరధర్మానికి తగినట్టు ఆలపించి వాటిని చిరస్మరణీయం చేశారు రాజా.
ఇక రాజా గురించి ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెడితే... 1929 జూలై 1వ తేదీన చిత్తూరు జిల్లా రామచంద్రాపురంలో లక్ష్మమ్మ, మన్మధరాజు దంపతులకు జన్మించారు ఎ.ఎం.రాజా. మద్రాస్‌లో బి.ఏ. పూర్తిచేశారు. కాలేజీ రోజులనుంచి సంగీత కార్యక్రమాల్లో ప్రతిభ చూపుతున్న రాజాను ఓ సంగీత కార్యక్రమంలో చూసి ముగ్ధులైన జెమినీ వాసన్ తొలిసారి ‘సంసారం’ (1951) తమిళ చిత్రం ద్వారా గాయకునిగా అవకాశం కల్పించారు. 1952లో ‘ఆదర్శం’చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమలో ప్రవేశించారు. నటుడు జగ్గయ్య కూడా ఈ చిత్రం ద్వారానే పరిచయమయ్యారు.
ఆనాటినుంచి తమిళ తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లోనూ, శ్రీలంకలో నిర్మించిన సింహళ చిత్రాల్లోనూ వందలాది గీతాలు ఆలపించారు. పదులకొద్ది చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు.
తమిళంలో నటులు యం.జి.రామచంద్రన్, శివాజీ గణేశన్, జెమినీ గణేశన్‌లకు కన్నడ నటులు రాజ్‌కుమార్‌కు ఎన్నో పాటలు పాడిన ఎ.ఎం.రాజా హిందీలో ‘‘బహుత్ దిన్ హుయే’’ చిత్రం ద్వారా దక్షిణాది నుంచి ప్లేబాక్ పాడిన తొలి గాయకునిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
గాయని జిక్కి (పి.జి.కృష్ణవేణి)ని ప్రేమించి పెళ్ళిచేసుకున్నారు రాజా. వీరిరువురి కాంబినేషన్ అనేక గీతాలు శ్రోతలనలరించాయి.
తెలుగులో రాజా రెండు చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. అవి ‘శోభ’, ‘పెళ్ళికానుక’. పెళ్ళికానుక పాటలన్నీ (పులకించని మది పులకించు, వాడుక మరిచెదవేల, ఆడేపాడే పసివాడా) ఎంతో ప్రజాదరణ సాధించాయి.
ఎన్.టి.ఆర్.కు ‘మిస్సమ్మ’ చిత్రంలో రాజా ఆలపించిన గీతాలన్నీ ఆణిముత్యాలే. ‘‘బృందావనమది అందరిది’’, ‘‘ఆడువారి మాటలకు అర్థాలే వేరులే’’ ఎన్నదగినవి. విజయావారి ‘‘అప్పుచేసి పప్పుకూడు’’ చిత్రంలో ఘంటసాలతో కలిసి ‘‘సుందరాంగులను చూచిన వేళల’’, ‘చిన్నారి చూపులకు ఓ చందమామ’’, ‘‘మూగవైననేమిలే’’, ‘‘చేయి చేయి కలుపరావే’’ జగ్గయ్యకు ప్లేబాక్ పాడగా, ‘వీరకంకణం’ చిత్రంలో హీరో ఎన్.టి.ఆర్.కు ‘‘కట్టండి వీరకంకణం’’, ‘‘అందాల రాణి ఎందుకోగాని’’ పాడగా, విలన్ పాత్రధారి జగ్గయ్యకు ఘంటసాల పాడడం ఓ విశేషం. ‘వెన్నెల పందిరిలోనా’’ ‘‘యవ్వన మధువనిలో’’ (బంగారుపాప) ‘‘ప్రియతమా మనసు మారునా’’ (ఆలీబాబా 40 దొంగలు) మరపురానివి.
‘‘పక్కింటి అమ్మాయి’’ చిత్రంలో హీరో స్నేహితునిగా నటించారు. ‘‘కలయేమో ఇది నా జీవిత ఫలమేమో’’ అని ఆలపించారు.
వీరికి ఎక్కువ ప్రోత్సాహమిచ్చిన సంగీత దర్శకులు కె.వి.మహదేవన్, సత్యం. రాజా చివరిగా 1970లో విడుదలయిన ‘పుట్టినిల్లు మెట్టినిల్లు’ చిత్రంలో ఓ పాట పాడారు.
తన భార్య జిక్కి పాడాలంటే తాను కూడా ఆ చిత్రంలో పాడాలనే నిబంధన పెట్టడంవల్ల ఇద్దరికీ అవకాశాలు సన్నగిల్లాయి. నిక్కచ్చి మనస్థత్వం, సూటిగా మాట్లాడ్డంవల్ల చిత్రసీమలో రాణించలేకపోయినా తన ప్రత్యేకతను నిలబెట్టుకున్న మధుర గాయకుడు ఎ.ఎం.రాజా. 1989లో రైలు ఎక్కబోతూ జారిపడి ప్రమాదవశాత్తూ మరణించారు.